అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ నమూనా స్ఫూర్తితో స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. ఈ సందర్బంగా గుజరాత్ నమూనాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాకుండా గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఒకే స్థిరమైన ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో స్థిరంగా ముందుకు సాగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాయుడు ప్రసంగించారు. టిడిపి వ్యవస్థాపకుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన శిబిరంలో స్వచ్ఛంద రక్తదాతలకు ఆయన ధృవపత్రాలను కూడా పంపిణీ చేశారు.
ఇప్పటికే ఉన్న 200కు పైగా క్యాంటీన్లకు అదనంగా త్వరలో మరో 700 అన్నా క్యాంటీన్లు తెరవనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గృహనిర్మాణ శాఖకు ఒక గడువును కూడా నిర్దేశిస్తూ, ఉగాది పండుగ నాటికి 5 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు నారా చంద్రబాబు నాయుడు. గ్రీంకో, భోగాపురం విమానాశ్రయం , అమరావతి వంటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు తమ మీడియా సంస్థల ద్వారా విషం వెదజల్లుతున్నాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలను నాయుడు తప్పుబట్టారు. ఎక్కడ నివసిస్తే అది రాజధాని అవుతుంది అని చెప్పడం బాధ్యతా రాహిత్యమని అన్నారు.
ఒకరు బెంగళూరులో ఉంటే అది రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులను ప్రజలు తిరస్కరించారని అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజానికి తావులేదని ప్రకటించారు. సైబరాబాద్, అమరావతి, కియా మోటార్స్, భోగాపురం వంటి ప్రాజెక్టులు టీడీపీ కిరీటంలో కలికితురాయి లాంటివని ఆయన అన్నారు.
The post గుజరాత్ నమూనా ఆంధ్రప్రదేశ్ లో పాలన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
