హైదరాబాద్ : బాసర నుంచి భద్రాచలం వరకు ఒక టెంపుల్ సర్క్యూట్ గా దేవాలయాలను అభివృద్ది చేస్తామని ప్రకటించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆధ్యాత్మిక వైభవంతో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల అభివృద్ది, వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన గోదావరి పుష్కరాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సహచర మంత్రులు, ఆయా శాఖల అధికారులతో కలిసి చర్చించారు.
గోదావరి పుష్కరాల నేపధ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. బాసర ఆలయానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆమోదం ఉన్నందున, భద్రాచలం దేవస్ధానం మాస్టర్ ప్లాన్ ను కూడా కమిటీలో చర్చించి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి సమగ్ర రోడ్ల అనుసంధానం కల్పించే విధంగా, ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన వసతుల ఏర్పాట్లతో పాటు పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారి సౌకర్యాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణ ఇతర సౌకర్యాల కల్పనపై తీసుకోవాల్సిన చర్యలను ఈ కీలక సమావేశంలో చర్చించారు.
The post గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
