హైదరాబాద్ : వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో జరగిన బయోఏషియా-2026 సదస్సు ను ప్రారంభించి ప్రసంగించారు. జీవవిజ్ఞాన రంగానికి చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీలు, శాస్త్రవేత్తలు, నిపుణులు మరింత దృష్టి పెట్టాలని కోరారు.
తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతోందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్ను ఇప్పుడు అందరం కలిసి సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామని అన్నారు సీఎం.
ప్రధానంగా ‘టెక్బయో అన్లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవవైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదిగేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. జీవవైజ్ఞానిక రంగంలో ప్రస్తుతం వస్తున్న ఆధునిక మార్పులను గమనిస్తే, పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఆయా సంస్థలు, కార్పొరేట్లు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
బల్క్డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచస్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందని అన్నారు. 23 ఏళ్ల కిందట బయోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్ వేర్ నగరంగా గుర్తింపు ఉండేదన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా కూడా నిలిచిందని అన్నారు
The post జీవ వైజ్ఞానిక వేదికగా హైదరాబాద్ కావాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
