హైదరాబాద్ : అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని హాస్టళ్ల నిర్వాహకులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. వస్తున్నది వేసవి కాలం అని, ఎక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా పెనుముప్పు సంభవిస్తుందని హెచ్చరించారు. ఇటీవల నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాలే ఇందుకు నిదర్శనమన్నారు. నగరంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న హాస్టళ్లు చాలావరకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు కమిషనర్. ఫిర్యాదుల నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఓ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. హాస్టళ్ల నిర్వాహకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏవీ రంగనాథ్ ఫైర్ సేఫ్టీ విషయంలో పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. దేశ వ్యాప్తంగా అనేకమంది నగరానికి వచ్చి జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. నగరంలోని పలు హాస్టళ్లలో నివాసం ఉంటున్నారని చెప్పారు.
మీరు నిర్వహిస్తున్న హాస్టల్ వారికి ఓ వరం కావాలని అన్నారు. వారి బంగారు భవిష్యత్తుకు హాస్టళ్లు ఒక మెట్టుగా ఉండాలే తప్పా భారంగా భావించ కూడదని పేర్కొన్నారు కమిషనర్. వారి భద్రత విషయంలో రాజీ పడొద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. హాస్టళ్ల నిర్వాహకులతో సమావేశానికి ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన ఎల్లారెడ్డి గూడ, సంజీవరెడ్డినగర్ ప్రాంతాల్లోని మూడు హాస్టళ్లను ర్యాండమ్గా చెక్ చేశారు. అక్కడి పరిస్థితులు చాలా ఆందోళన కలిగించాయి. చిన్న గదుల్లో స్థాయికి మించి కిక్కిరిసిన బెడ్లు.. ఎక్కడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కనిపించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్లార్లలో మెస్లు.. భద్రతకోసం వేసిన గ్రిల్స్.. వాటికి తాళాలు. ఎక్కడా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కనిపించ లేదు. నాలుగైదు అంతస్తులున్న హాస్టల్ భవనంలో పొరపాటున నిప్పు రగిలితే ఆ ప్రమాదాన్ని ఊహించలేం అన్నారు.
The post నిర్లక్ష్యం వద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ పడొద్దు : ఏవీ రంగనాథ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
