అమరావతి : మత్స్యకారుల పొట్టకొట్టేలా జగన్ రెడ్డి తెచ్చిన దుర్మార్గమైన జీవో నంబర్ 217ను రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు వేలాది మంది గంగపుత్రులకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకుందని తెలిపారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. శనివారం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం గాలికొదిలేసిన 18 గస్తీ బోట్లను యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయించడం జరిగిందన్నారు. అంతే కాకుండా తమిళనాడు బోట్ల చొరబాటుకు చెక్ పెట్టామన్నారు. జివ్వలదిన్న హార్బర్లో వస్తున్న షిప్ బిల్డింగ్ పరిశ్రమ ద్వారా మత్స్యకార యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఆంధ్రరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, నాడు ఎన్టీఆర్ నుండి నేడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు అదే బాటలో నడుస్తున్నారని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మత్స్యకారుల పొట్టకొట్టిన చరిత్ర వైసీపీదేనని, ఈరోజు వారు కారుస్తున్నవి ‘ముసలి కన్నీరు’ అని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల చొరబాటు అనేది దశాబ్దాల సమస్య అని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి 18 కోస్ట్ గార్డ్ బోట్లను రాష్ట్రానికి తీసుకు వచ్చారని తెలిపారు. కానీ, 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం ఆ బోట్ల మెయింటెనెన్స్ను పూర్తిగా గాలికొదిలేయడం వల్ల అవన్నీ రిపేర్లకు గురై మూలన పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి నిధులు కేటాయించారని చెప్పారు.
The post మత్స్యకారులకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
