ఖమ్మం జిల్లా : వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలు ఇస్తామని ప్రకటించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బాధితులకు అండగా నిలుస్తాం అన్నారు. వెలుగుమట్ల వంటి సంఘటనలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని తెలిపారు. వాటిని రాష్ట్ర ప్రజలు గమనించాలని, దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. ఆదివారం ఖమ్మం ఐడిఒసి వేదికగా వెలుగుమట్ల బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఆవేదనను విని, భరోసా ఇచ్చారు. వెలుగుమట్ల భూముల విషయంలో పనిగట్టుకుని ఒకే కోణంలోనే కొన్ని పత్రికలు, ఛానల్స్ వార్తకథనాలను వండీ ,వార్చాయి తప్ప నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
వాస్తవానికి వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, అప్పుల పాలై నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతను గ్రహించ లేదని అన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రెక్కాడితే గానీ డొక్కాడని వారు రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించారని ఆరోపించారు. పట్టాలొస్తాయని నమ్మబలికి పేదలకు ఆశ చూపెట్టి దానినే ఆసరా చేసకుని నట్టేట ముంచారని మండిపడ్డారు. పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా కొందరు 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడ్డారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను వంటి మౌళిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు.
The post వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
