అమరావతి : వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014–2019 మధ్య తెదేపా హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.987.71 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు వ్యక్తిగతంగా అందించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాలంలో వ్యక్తిగత రైతులకు యంత్రాలు ఇవ్వకుండా కేవలం కస్టమ్ హైరింగ్ సెంటర్ల (CHC) పేరుతో రూ.367.38 కోట్ల సబ్సిడీ యంత్రాలను పంపిణీ చేశారని తెలిపారు, అయితే అవి రైతులకు అద్దె ప్రాతిపదికన అందిన దాఖలాలు లేవని విమర్శించారు. ఏ CHC నుండి ఎవరికి, ఎలాంటి యంత్రాలు ఇచ్చారో లెక్కలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజా ధనంతో ఇచ్చిన యంత్రాలు దుర్వినియోగం కాకుండా పారదర్శక విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
2024-25లో CSS-RKVY-SMAM పథకం కింద రూ.60.55 కోట్ల విలువైన యంత్రాలు 50% సబ్సిడీపై 25,187 మంది రైతులకు అందించామని అన్నారు అచ్చెన్నాయుడు. అలాగే RKVY-DPR కింద 872 కిసాన్ డ్రోన్లు పంపిణీ చేశామని చెప్పారు. 2025-26లో 38,000 మంది రైతులకు రూ.136.62 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యక్తిగత యంత్రాలు అందించే ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు. CSS-RKVY-SMAM కింద FPOలు, SHGలకు 80% సబ్సిడీతో రూ.80 కోట్ల వ్యయంతో 1,000 కిసాన్ డ్రోన్లు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ/అగ్రి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు 50% సబ్సిడీతో 75 కిసాన్ డ్రోన్లు (రూ.3.75 కోట్లు) ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. రూ.19.68 కోట్లతో 164 CHCలకు ఆధునిక యంత్రాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
మొత్తం మీద 2025-26లో CSS-RKVY-SMAM కింద 38,239 యాంత్రీకరణ యూనిట్లను రూ.240 కోట్లతో అందించనున్నట్లు తెలిపారు అచ్చెన్నాయుడు. రైతులు నేరుగా యంత్రాలను అద్దెకు పొందేందుకు A.P.A.I.M.S. 2.0 యాప్ను అందుబాటులోకి తీసుకు వచ్చామని, 2026-27 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు రూ.139.65 కోట్లు కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు చేతికి సబ్సిడీ నేరుగా చేరే విధంగా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తామని తెలిపారు.
The post వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
