తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు 7వ తేదీ శనివారం అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహ వాచనం, మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 8న ఉదయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. అంతకు ముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. శ్రీనివాస మంగాపురం పరిసర గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. వాహన సేవల సమయంలో భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు, వైద్య, పార్కింగ్, క్యూలైన్లు, భద్రత తదితర సేవలను అందించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి దాదాపు 10 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీ జాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహన సేవల్లో స్వామి, అమ్మ వార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతా మూర్తుల విద్యుత్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.
The post శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
