అమరాతి : మోపిదేవిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శనివారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు . ఆలయానికి వచ్చిన కొల్లు రవీంద్రకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని నాగ పుట్టలో రవీంద్ర పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీ స్వామి వారిని దర్శించు కొనగా , ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లు రవీంద్రను దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు.
అనంతరం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా, ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన శాసనసభ, శాసనమండలి లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. చేసిన తప్పులకు వైసిపి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని దుయ్యబట్టారు. అయినా పశ్చాతాపం లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని తప్పులకు పాల్పడుతోందని, దాని పర్యవసానంగా రాబోవు ఎన్నికలలో 11 సీట్ల కంటే మరింత తక్కువకు పరిమితం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్ధనరావు, జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు చందన రంగారావు, కొల్లి మురళి, విస్సంశెట్టి రాజా, గొరిపర్తి సత్యనారాయణ, యక్కటి కృష్ణార్జునరావు, మోటుపల్లి పండు, కనకయ్య , తదితరులు పాల్గొన్నారు.
The post శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
