ఇటీవల పశ్చిమ బెంగాల్లో భారీ వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జల్పాయీగుడీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూటాన్ నుంచి వెల్లువెత్తిన జలప్రవాహం కారణంగానే వరదలు సంభవించాయని ఆరోపించారు. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
‘‘భూటాన్ నుంచి ముంచుకొచ్చిన నదీ జలాల కారణంగానే మాకు నష్టం జరిగింది. ఆ దేశం పరిహారం చెల్లించాలి’’ అని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని సహాయక, పునరావాస చర్యలు చేపడుతోందన్నారు. కేంద్రం తరఫున ఎటువంటి ఆర్థిక సాయం లేదని ఆరోపించారు. భారత్-భూటాన్ ఉమ్మడి నదీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, అందులో పశ్చిమ బెంగాల్ ను భాగం చేయాలని తమ ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తోందన్నారు. తమ ఒత్తిడితో ఈ నెల 16న కేంద్రం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, దీనికి రాష్ట్ర అధికారులు హాజరవుతారని వెల్లడించారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, జల్పాయీగుడీ తదితర ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 32 మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నేపాల్, భూటాన్లోనూ ఎడతెరిపిలేని వర్షాలతో నష్టం వాటిల్లింది. ఈ వరదలు, వాటి వల్ల జరిగిన విధ్వంసానికి మానవ తప్పిదమే కారణమని దీదీ ఇటీవల ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె సందర్శించడం ఇది రెండోసారి.
The post CM Mamata Banerjee: భూటాన్ వల్లే బెంగాల్ లో వరదలు – మమతా బెనర్జీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
