గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొన్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కొత్త సమస్యలను సృష్టించి కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందుల పాల్జేస్తున్నదని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెన్షనర్ల హక్కులను కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత పదేండ్లలో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూర్చిన బీఆర్ఎస్కు త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చి, కాంగ్రెస్, బీజేపీలకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ మేరకు బహిరంగ లేఖలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను విన్నవించింది. ఆ లేఖ సారాంశం..
తెలంగాణలో ఉద్యోగుల, పెన్షనర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 22 నెలలు గడుస్తున్నా వాటిలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా అదనంగా అనేక సమస్యలు సృష్టించి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నది.
పెండింగ్ డీఏ తక్షణమే చెల్లిస్తామని చెప్పి రెండు విడతలే చెల్లించి 5 విడతల డీఏ బాకీ పడింది. బకాయిలు 28 వాయిదాల్లో చెల్లిస్తామని ఉత్తర్వులు ఇచ్చింది. దాదాపు 15 శాతం హెచ్చింపు అంటే సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రతి నెల ప్రతి ఉద్యోగి నష్టపోతున్నారు.
ఆరు నెలల్లో పే రివిజన్ చేస్తామని చెప్పిన మాట నీటిమూటగా మారింది. న్యాయంగా జూలై 2023 నుంచి పీఆర్సీ అమలు చేయాలి. కానీ, ఇప్పటికీ దిక్కులేదు. కేసీఆర్ సకాలంలో పీఆర్సీ నియమించి 5 శాతం మధ్యంతర భృతిని విడుదల చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదపడం లేదు. దీనివలన ప్రతి ఉద్యోగి, పెన్షనర్ నెల నెలా రూ.10 వేల నుంచి రూ.20 వేలు నష్టపోతున్నారు. 42 రోజులు సకలజనుల సమ్మె చేసిన ఉద్యోగులను గౌరవిస్తూ కేసీఆర్ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. కరోనా సమయంలోనూ 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు కేసీఆర్. రెండు పీఆర్సీలు కలిపి 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు.
హెల్త్కార్డులపై ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కలుపుకొని నగదు రహిత వైద్య సేవలను అందిస్తామని ఇచ్చిన ముఖ్యమైన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు. నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాత జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటుచేసి సేవలందించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కోసం నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేసి నగదు రహిత సేవలందించాలని నిర్ణయించారు. కానీ, ఎన్నికల కోడ్ వలన అమలు కాలేదు. కాంగ్రెస్ వచ్చి 22 నెలలు గడిచినా హెల్త్ కార్డులు ఇవ్వటం లేదు. దీంతో వైద్యం కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ నష్టపోతున్నాం. ఆ డబ్బుల్లో 10 శాతం కూడా రీయింబర్స్ కావడం లేదు.
2024 మార్చి నుంచి ఇప్పటివరకు 18,672 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వీరికి ప్రయోజనాలేవీ చెల్లించటం లేదు. బెనిఫిట్స్ రాక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై చాలామంది అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోగా, ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. కానీ, 4 నెలలవుతున్నా కనీసం రూ.వంద కోట్లు అయినా చెల్లించలేదు.
ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న హామీ పరిశీలనకూ నోచుకోలేదు. సెప్టెంబర్ 2004 నుంచి ఉద్యోగంలో చేరినవారికి బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి పెన్షన్ హక్కును రద్దు చేయడం దుర్మార్గం. ఇదే కాంగ్రెస్ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ హక్కును కొల్లగొట్టి దగా చేసింది. నేడు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సైతం దారిమళ్లించి ఇతర పనులకు వాడుకొని దగా చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పెన్షన్ విధానాన్ని మార్చింది. ఇకముందు పెన్షన్లో ఎలాంటి హెచ్చింపులు లేకుండా చట్టం చేసి మన పొట్ట కొట్టడానికి రంగం సిద్ధం చేసింది.
317 జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్న హామీని కాంగ్రెస్ గాలికొదిలేసింది.
అందరికీ 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని చెప్తున్నా కొంతమందికే ఇస్తున్నారు. లక్షలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నెలల తరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నది. వేతనాలు తక్షణమే హెచ్చింపు చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడిగిన పాపానికి మహిళా ఉద్యోగులపై లాఠీఛార్జి చేయటం దారుణం. దాదాపు 20 వేల మంది ఉద్యోగులను బలవంతంగా ఉద్యోగాల నుంచి తీసేయడం సిగ్గుచేటు.
తనను కోసుకుతిన్నా, వండుకుతిన్నా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని ముఖ్యమంత్రి చేసిన బరితెగింపు వ్యాఖ్యలు విస్మయపరిచాయి. ప్రజలకు, ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టే విధంగా ‘ఏ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆపేసి మీకు ఇవ్వాలో చెప్పాలి’ అని ఉద్యోగులను అడగడం ముఖ్యమంత్రి అతి తెలివికీ, పలాయనవాదానికీ నిదర్శనం. చివరికి పండుగ అడ్వాన్స్ బిల్లులు, టీఏ, లీవ్ శాలరీ కూడా చెల్లించక ఉద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు.
విధి నిర్వహణ కోసం కావాల్సిన కనీస నిధులు విడుదల చేయకపోవడం వలన పంచాయతీ కార్యదర్శులు, హాస్టల్ వార్డెన్లు సొంత డబ్బులు వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు. ఎవరు ఏది అడిగినా రేవంత్ సర్కార్ ఒక్కటే మాట చెప్తున్నది. గత ప్రభుత్వం అప్పులు చేసిందని, వస్తున్న రెవెన్యూలో రూ.6,500 కోట్లు అప్పులే కడుతున్నామని బుకాయించడం పరిపాటిగా మారింది. 22 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.2.40 లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తే అప్పులు తీర్చడానికే అప్పులు అని అబద్ధాలాడుతూ మోసపుచ్చుతున్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకున్నారు. కరోనా కాలంలో జీతాలు ఒకటవ తేదీకి రావడం లేదనే ఆవేదనతో గత ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన పాపానికి, ఇప్పుడు మన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి తరుణంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్యోగులు, పెన్షనర్లు ఏకమై కాంగ్రెస్ను ఓడిస్తేనే సర్కార్కు కనువిప్పు కలుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మనకు పీఆర్సీ రాదు, డీఏలు ఉండవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, సీపీఎస్ రద్దు ఊసే ఉండదు.
బీజేపీ కూడా పెన్షనర్ల హక్కులను కాలరాస్తూ చట్టాలు చేసింది. భవిష్యత్తులో పెన్షనర్లకు పీఆర్సీ బంద్, డీఏ బంద్ అని ఇప్పటికే ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులకు మరణశాసనం రాస్తున్న రెండు పార్టీలను ఓడించి బలమైన సంకేతం ఇద్దాం. తెలంగాణ ఉద్యోగుల శక్తి ఏమిటో రుచి చూపిద్దాం. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రెండుసార్లు మెరుగైన పీఆర్సీ ఇవ్వటమే కాకుండా, నేడు రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా గళం ఎత్తడంలో మనకు మద్దతుగా నిలుస్తున్న బీఆర్ఎస్కు మనం మద్దతు ప్రకటిద్దాం. కాంగ్రెస్, బీజేపీలకు గుర్తుండిపోయే విధంగా బలమైన గుణపాఠం నేర్పిద్దాం.
– ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ
