బీహార్ ఎన్నికల వేళ ఈసీ నకిలీ ఓటర్లపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఆయనకు రెండు ఓటరు ఐడీలు ఉన్నట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ విషయంపై మూడు రోజుల్లో స్పందనను తెలియజేయాలని పీకేకు సూచించింది. త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికల్లో పీకే పార్టీ పోటీచేయనున్న నేపథ్యంలో ఈసీ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎన్నికల అధికారులు వెల్లడించిన అధికారిక రికార్డుల ప్రకారం..ప్రశాంత్ కిశోర్కు పశ్చిమ బెంగాల్ని కాళీఘాట్ రోడ్లో ఓటరు ఐడీ ఉంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం చిరునామా. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేశారు. అప్పట్లో పీకే టీఎంసీ పార్టీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. బిహార్లోని తన స్వస్థలం కార్గహర్ నియోజకవర్గంలోనూ పీకే ఓటరుగా నమోదయ్యి ఉన్నారు.
బిహార్లో రోహటాస్ జిల్లా ససరాంలోని కర్గాహార్ అసెంబ్లీ నియోజవవర్గం రిటర్నింగ్ అధికారి ఈ నోటీసులు పంపారు. కర్గాహార్లోని పోలింగ్ బూత్ నెంబర్ 621లో ఎపిక్ (ఓటర్ ఐడి) నంబర్ 1013123718 కింద ఓటరుగా ఆయన పేరు నమోదైందని, ఇదే సమయంలో పశ్చిమబెంగాల్లోని భాబనిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సెయింట్ హెలెన్ స్కూలు పోలింగ్ బూత్లో కూడా ఆయన పేరు నమోదై ఉందని ఆ నోటీసులో రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 17 కింద ఒక వ్యక్తి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో పేరు నమోదు చేసుకోరాదు. అలా చేసినట్లయితే సెక్షన్ 31 కింద ఏడాది జైలు లేదా జరిమానా.. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది.
ఈసీ నోటీసులపై స్పందించిన జన్ సురాజ్ పార్టీ
ప్రశాంత్ కిశోర్కు ఈసీ నోటీసులపై జన్ సురాజ్ పార్టీ ప్రతినిధి కుమార్ సౌరభ్ సింగ్ స్పందిస్తూ..ఇది ఎన్నికల సంఘం తప్పిదమేనని అన్నారు. ఓటరు కార్డుల జారీ విషయంలో సక్రమంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈసీకి ఉందని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ వంటి ప్రముఖుల విషయంలో తప్పులు చేసిన ఎన్నికల సంఘం ఇక సామాన్యుల విషయాల్లో ఎలా వ్యవహరిస్తుందో అన్నది తెలిసిన విషయమేనన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున ఈసీ నోటీసులపై ప్రశాంత్ కిషోర్ వెంటనే స్పందించలేదు.
The post Prashant Kishor: ప్రశాంత్ కిశోర్కు ఎన్నికల సంఘం నోటీసులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
