జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంసాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.
ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచే నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ రౌండ్కూ అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లోనూ BRS అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్రెడ్డి సర్కార్కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహానిచ్చింది. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించింది. భారత రాష్ట్ర సమితి, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకు డిపాజిట్ గల్లంతైంది.
వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం రేవంత్
కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీల్లో మరింత పట్టుకోసం పోలింగ్కు కొద్దిరోజుల ముందే అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు.
ఓటములనే మెట్లుగా చేసుకుని విజయం సాధించిన నవీన్ యాదవ్
2009లో యూసుఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నిలిచి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోటీ చేసి 41,656 ఓట్లు(25.19%) సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రహ్మత్నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ పోటీచేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబరు 15న అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
The post Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
