ఐ బొమ్మ కేసులో కీలక నిందితుడు రవిపై కస్టడీ విచారణ ఐదో రోజుకు చేరుకుంది. నేటితో ఆయన కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో, గత నాలుగు రోజులుగా సైబర్ క్రైమ్ పోలీసులు రవిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ మొత్తం రవి పొంతన లేని సమాధానాలు ఇస్తూ, పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది, విదేశాల్లో ఉన్న సర్వర్ల వివరాలపై ఆధారాలు చూపిస్తూ ప్రశ్నించినప్పటికీ, రవి స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని విచారణ వర్గాలు తెలిపాయి. డేటా అంతా విదేశాల్లో ఉందని, తనకు సహకరించిన వారు ఎవరూ లేరని చెప్పుతూ తప్పించుకోవడానికి యత్నించాడు. అంతేకాక, హార్డ్డిస్క్లలో ఉన్న సినిమా ఫైళ్ల మినహా మిగతా డేటా మొత్తాన్ని అరెస్టు ముందు డిలీట్ చేసినట్లు కూడా విచారణలో బయట పడింది. దీంతో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Also Read : Keerthy Suresh: మోడర్న్ వైట్ లుక్లో కీర్తి మ్యాజిక్..
అయితే ఈ కేసులో రవి కదలికలను సుమారు మూడు నెలలపాటు గమనించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, అతని ఈ–మెయిల్ లింక్ల ద్వారానే అసలు ట్రాక్ను గుర్తించారు. ‘ఈ ఆర్ ఇన్ఫోటెక్’ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్లు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, వాడిన క్రెడిట్–డెబిట్ కార్డుల వివరాలపై పోలీసులు ఇప్పటికే పలు బ్యాంకులకు మెయిల్స్ పంపించారు. అందిన వివరాల ఆధారంగా మరింత సమాచారం గుర్తించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్ రూపొందించి, పైరసీ సినిమాలను అప్లోడ్ చేసినట్లు రవి విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. పైరసీ సినిమాలు చూడడమే అలవాటు కాగా, అదే తనను ఈ దారికి నెట్టిందని మొత్తం వ్యవహారాన్ని ఒక్కడినే నిర్వహించానని రవి వెల్లడించినట్లు తెలుస్తోంది.
