అమరావతి : భారత దేశం ఔన్నత్యాన్ని, రాజ్యాంగానికి ఉన్న విలువలను ప్రత్యేకంగా విద్యార్థులకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్సీ , ప్రముఖ నటుడు నాగబాబు కొణిదల. 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశం కోసం కుటుంబాన్ని, జీవితాన్ని, ఆఖరికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహానుభావుల త్యాగాలను, భారతదేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలని సూచించారు. రాబోయే తరాల చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయించాలని శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో జాతీయ జెండా ఆవిష్కరణ చేయించారు.
భారత దేశం నా మాతృభూమి., భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అనే ప్రతిజ్ఞ తప్పనిసరిగా చేయించాలని స్పష్టం చేశారు నాగబాబు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం ప్రతిజ్ఞ చేయిస్తున్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలల్లో చాలా వరకు ప్రతిజ్ఞ చేయించట్లేదని అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా మనమంతా భారతీయులం అనే భావన ప్రతిజ్ఞలో ఉంటుందని వెల్లడించారు. దేశ గౌరవాన్ని గుర్తించాలి, దేశం కోసం పనిచేయాలి, దేశాన్ని పరిరక్షించాలి.. అనే భావన విద్యార్థుల్లో పెంపొందించాలన్నారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు డాక్టర్ పంచకర్ల సందీప్, జనసేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గేదెల చైతన్య, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు, జీసీసీ డైరెక్టర్ నిబ్రమ్, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ విశ్వక్ సేన్, ఆముదాలవలస పీఏసీ పెదాడ రామ్మోహన్, టెక్కలి పీఓసీ కణితి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
The post భారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
