Jowar Biscuit Recipe: సాధారణంగా బిస్కెట్లు అంటే మైదా పిండితో చేస్తారని మనందరికీ తెలుసు. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న పిండితో కూడా ఎంతో రుచికరమైన, క్రంచీ బిస్కెట్లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ జొన్న బిస్కెట్స్ (Jowar Atta Biscuits) ఎలా చేయాలో ఇప్పుడు చేసేద్దాం.
అవసరమైన పదార్థాలు:
* జొన్న పిండి: 1 కప్పు.
* పంచదార పొడి: అర కప్పు.
* వెన్న (Butter) లేదా కొబ్బరి నూనె: 3 టేబుల్ స్పూన్లు.
* యాలకుల పొడి లేదా వనిల్లా ఎసెన్స్: 1 టీస్పూన్.
* బేకింగ్ పౌడర్: పావు టీస్పూన్.
* పాలు: పిండి కలపడానికి తగినన్ని.
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో జొన్న పిండి, పంచదార పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వెన్న లేదా కొబ్బరి నూనె వేసి పిండికి బాగా పట్టించాలి. అవసరమైతే కొద్దిగా పాలు పోస్తూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలుపుకోవాలి. కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, బిస్కెట్ల మాదిరిగా ఒత్తుకోవాలి. వాటిని మీకు నచ్చిన ఆకారంలో వీటిని తయారు చేసుకోవచ్చు.
ఓవెన్ లేకపోయినా వీటిని చేసుకోవచ్చు. ఒక మందపాటి గిన్నెలో ఉప్పు వేసి, దానిపై ఒక స్టాండ్ ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి. ఒక ప్లేట్కు నెయ్యి రాసి.. అందులో సిద్ధం చేసుకున్న బిస్కెట్లను అందులో అమర్చాలి. ఈ ప్లేట్ను వేడి చేసిన గిన్నెలో స్టాండ్పై ఉంచి, మూత పెట్టి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు తక్కువ మంట మీద బేక్ చేయాలి. అలా బిస్కెట్లు మంచి రంగులోకి వచ్చిన తర్వాత బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఇవి కాస్త మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత ఎంతో కరకరలాడుతూ రుచిగా మారుతాయి.
