PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒత్తిళ్లకు ప్రధానమంత్రి మోదీ తలొగ్గారా? ఆప్తమిత్రుడు అదానీపై అమెరికాలో కేసులు కొనసాగుతుండటం, వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ప్రస్తావనకు రావడం, సుంకాల విషయంలో తన దౌత్యం విఫలమవ్వడం.. వెరసి సర్వత్రా విమర్శలు వస్తుండటంతో దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన ట్రేడ్ డీల్ను ప్రధాని మోదీ ఉన్నపలంగా ఖరారు చేశారా? ఈ ట్రేడ్ డీల్తో భారత్ కంటే అమెరికాకే ఎక్కువ లాభం అని తెలిసినప్పటికీ, దేశ ప్రయోజనాలను మోదీ తాకట్టుపెట్టారా? ప్రతిపక్ష నాయకుల విమర్శలు, సోషల్మీడియాలో జరుగుతున్న చర్చను విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.
డీల్తో మనకు ఏమీ ఒరగలేదు
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని అద్భుతమైనదిగా అధికార నేతలు ప్రచారం చేసుకొంటున్నా.. ఈ డీల్తో అమెరికాకే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతున్నట్టు ఆర్థికరంగ నిపుణులు, విపక్షాలు చెబుతున్నాయి.
ట్రంప్ ప్రకటించిన తాజా డీల్ ప్రకారం.. భారత్పై ప్రతీకార సుంకాలను 50 శాతం (రష్యా చమురు కొనుగోలుకు విధించిన 25 శాతం అదనపు సుంకంతో కలిపి) నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. అయితే, అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాలను జీరోకు తగ్గించడం గమనార్హం. అంటే, అమెరికా ఉత్పత్తులపై మనం ఎలాంటి సుంకాలు విధించకపోయినా.. అగ్రరాజ్యం భారత ఉత్పత్తులపై 18 శాతం అదనపు సుంకాలను కొనసాగిస్తుందని అర్థం.
500 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తులతో పాటు వీటికి అదనంగా మరిన్ని అమెరికా దిగుమతులను చేసుకోవడానికి భారత్ సిద్ధపడినట్టు ట్రంప్ వెల్లడించారు. అంటే, డీల్ ప్రకారం.. భారత్ కచ్చితంగా 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని అమెరికాతో నిర్వర్తించాల్సి ఉంటుంది.
డీల్ ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్నకు చాలా ధన్యవాదాలు అంటూ మోదీ ఉబ్బితబ్బిబ్బయిపోయారు. అయితే, తాజా డీల్ ప్రకారం.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్లోకి అనుమతించడానికి తలుపులను బార్లా తెరిచారు. ట్రంప్ ప్రకటనతోనే అది స్పష్టమైంది. అంటే, దేశంలోని 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేయడానికి మోదీ సిద్ధమయ్యారా? అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
దేశీయ రైతుల ప్రయోజనాలపై రాజీ లేదంటూ కేంద్రప్రభుత్వ వర్గాలు లీకులు ఇస్తున్న సమయంలోనే అంతర్జాతీయ పత్రిక ‘రాయిటర్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా నుంచి పెట్రోలియం, ఎయిర్క్రాఫ్ట్, ఫార్మా, టెలికంతో పాటు కొంతమేర వ్యవసాయ ఉత్పత్తులు కూడా భారత్కు దిగుమతి కానున్నాయని కేంద్రప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నట్టు రాయిటర్స్ ఉటంకించింది. అంటే, భారత రైతుల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టినట్టు అర్థం చేసుకోవాలని విపక్ష నేతలు, సోషల్మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. అమెరికా ఉత్పత్తులు దేశంలోకి ప్రవేశిస్తే.. భారత రైతులు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవచ్చని ధ్వజమెత్తుతున్నారు.
డీల్ సాయంతో సుంకాలను 18 శాతం వరకూ తగ్గించామంటూ మోదీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, సెక్షన్ 232 ప్రకారం.. స్టీల్, అల్యూమినియం, వాహన విడిభాగాలపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లు తగ్గాయా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. అమెరికా నుంచి చవకైన స్టీల్, వాహనాలు దిగుమతి అయితే గడ్డుపరిస్థితులు తప్పవని మనవారు భయపడుతున్నారు.
రష్యా చమురును కొనుగోలు చేయడాన్ని నిలిపివేయడమే కాదు, అమెరికా, వెనెజువెలా నుంచి మరింత చమురును కొనేందుకు భారత్ ముందుకు వచ్చిందని ట్రంప్ ప్రకటించారు. రష్యా మనకు దశాబ్దాల మిత్ర దేశం. చవగ్గానే అక్కడి నుంచి మనకు చమురు దిగుమతి అవుతుంది. ఇప్పుడు, డీల్ ముసుగులో రష్యాతో సంబంధాలు తెంచుకొంటే.. అది భారత్కు ఆర్థికంగానే కాదు దౌత్యపరంగానూ ఎంతమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డీల్ అందుకేనా??
ట్రంప్ సర్కార్తో మోదీ ప్రభుత్వం ఉన్నట్టుండి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి పలు కారణాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో మొదటిది అదానీ వ్యవహారం. రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసు ఇటీవలే చివరి దశకు చేరినట్లయ్యింది. అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎఫ్సీపీఏ) ప్రకారం.. నేరం రుజువైతే గౌతమ్ అదానీకి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించవచ్చని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఆప్తమిత్రుడిని కాపాడటానికే మోదీ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గినట్టు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, అమెరికన్ ఫైనాన్షియల్, లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రధాని మోదీ పేరు ఇటీవల బయటకు వచ్చింది. ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయోజనాల కోసం మోదీ పని చేసినట్టు అమెరికా న్యాయశాఖ సదరు పత్రాల్లో వెల్లడించింది. సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో మోదీ పేరు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే మోదీ అమెరికాతో డీల్ కుదుర్చుకొన్నట్టు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
దేశాన్ని అమ్మేశారు : రాహుల్
ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా ఒత్తిడికి ట్రంప్ లొంగిపోయారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అరోపించారు. ఈ ఒప్పందం చేసుకొని రైతుల కష్టాన్ని, మొత్తంగా దేశాన్నే మోదీ అమ్మేశారని మండిపడ్డారు. అమెరికాలో వ్యాపారవేత్త అదానీపై కేసు ఉండటం, ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ప్రస్తావనకు రావడంతో మోదీ రాజీపడ్డారని ఆరోపించారు.
చమురు కొనుగోళ్ల నిలిపివేతపై సమాచారం లేదు
భారత్-అమెరికా ట్రేడ్ డీల్పై రష్యా స్పందన
మాస్కో: తమ దేశం నుంచి చమురు కొనుగోళ్లను నిలిపేస్తున్నట్టు భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని రష్యా మంగళవారం వెల్లడించింది. తాము భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని పునరుద్ఘాటించింది. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే రష్యా ఈ విధంగా స్పందించింది. రష్యా నుంచి చమురు నిలిపేస్తామని ఒప్పుకొన్నందునే భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలను నిశితంగా విశ్లేషిస్తున్నామని చెప్పారు. భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు.
