Manchu Vishnu | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ పరస్పరం మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటుండగా పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారంగా ఇరాన్ పలు దేశాల్లో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు అంతర్జాతీయ వార్తలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. విమాన సర్వీసులు కూడా నిలిపివేయబడడంతో అక్కడి పరిస్థితులు తీవ్రతరంగా మారాయి.
ఇలాంటి ఉద్రిక్త సమయంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు దుబాయ్ వెళ్లిన ఆయన, అక్కడి యుద్ధ వాతావరణాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. వీడియోలో ఆకాశంలోకి క్షిపణులు దూసుకెళ్లడం, వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. “ఇవి నా కళ్ల ముందే జరుగుతున్నాయి” అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు. క్షిపణుల ప్రభావంతో తాము బస చేసిన ఇల్లు కంపించిందని ఆయన తెలిపారు. యుద్ధ శబ్దాలకు తన చిన్నారి ఐరా ఒక్కసారిగా భయపడిందని భావోద్వేగంగా వెల్లడించారు.
“ఏ చిన్నారి కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెరగకూడదు. ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలకు ప్రశాంతమైన జీవనం ఉండాలి” అని తన పోస్టులో ఆకాంక్షించారు. పౌరుల భద్రత కోసం దుబాయ్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోందని, తమ భద్రతకు కృషి చేస్తున్న యూఏఈ రక్షణ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతోనే తాము సురక్షితంగా ఉన్నామని వివరించారు. ప్రస్తుతం మంచు విష్ణు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి విస్తృత చర్చకు దారి తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులపై మరోసారి దృష్టి సారించేలా చేసింది.
In Dubai visiting family tonight. Missiles visible in the sky. The loud interceptions shook our home and frightened little Ayra.
Praying for peace. No child anywhere should grow up hearing the sound of war above their roof.
Grateful to the UAE defense forces for keeping… pic.twitter.com/tCbE78eoBY
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2026
