అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె కూటమి సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. 2.5 లక్షల ఆరోగ్య భీమా పచ్చి మోసం అన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంతా బూటకం అంటూ మండిపడ్డారు. ఇది ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపే కుట్ర తప్ప మరోటి కాదన్నారు . పేదోడి సంజీవనిని ప్రైవేట్ పరం చేసేందుకే UHC అంటూ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్యం మీద ప్రభుత్వ భరోసాను లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. ప్రైవేట్ భీమా పేరుతో ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఉద్దేశ్య పూర్వకంగా ఆరోగ్యశ్రీ ని అనారోగ్య శ్రీ గా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ భీమా భారం తప్పా, లాభం లేదని తెలిసినా చంద్రబాబుకు UHC మీద ప్రేమ చావడం లేదని అన్నారు. ట్రస్ట్ విధానంలోనే ఆరోగ్యానికి భరోసా అని తెలిసినా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు రాష్ట్ర ఖజానా దోచిపెట్టాలని చూడటం దుర్మార్గం అని భగ్గుమన్నారు షర్మిలా రెడ్డి.
పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకు? ఎవరిపై ఈ కక్ష? ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్లు చెల్లింపులకు మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందే దోచిపెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయంటూ నిలదీశారు. ప్రభుత్వం అమలు చేసే ఆరోగ్యశ్రీ విధానాలకు, ప్రైవేట్ భీమా పెట్టే కండిషన్లకు పొంతన ఎక్కడిది ? రూ.2.5 లక్షల లోపు ఆరోగ్య బీమా ఏంటి… ఆపై ఖర్చును ట్రస్ట్ చెల్లించడం ఏంటి? ప్రైవేట్ బీమా అమలు చేసిన రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకుంటుంటే, ట్రస్ట్ విధానంలో నడిచే మన రాష్ట్రంలో ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు చెప్పాలని అన్నారు. ఆరోగ్య శ్రీ కాదని ప్రైవేట్ భీమా పెట్టడం ద్వారా జరిగే లాభం ఏంటో సమాధానం చెప్పాలన్నారు.
The post ఆరోగ్యశ్రీని చంపేసేందుకు కూటమి సర్కార్ కుట్ర appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
