అమరావతి : కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబు దేనని, ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగేలా పథకాలు అమలు అవుతున్నాయని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించారు. కాపుల సంక్షేమానికి ఏటా బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 2014-19 మధ్య విదేశీ విద్య కింద 1585 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించామన్నారు. ఆ 5 ఏళ్లలో రూ.153.11 కోట్లు కేటాయించామని, గత వైసీపీ ప్రభుత్వం కేవలం 81 మంది కాపు విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యా పథకం వర్తింప జేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 331 మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్యా పథకం బకాయిలు అందజేశామన్నారు. 2024-25లో కాపు సంక్షేమానికి రూ.4,440.25 కోట్లు ఖర్చు చేశామని, 2025-26లో కాపులకు రూ.5,571.48 కోట్లు కేటాయించామని తెలిపారు.
2014-19లో సీఎం చంద్రబాబు.కాపు భవనాల నిర్మాణాలకు నిధులిచ్చారని, అయితే వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు ఎస్. సవిత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపు భవనాల నిర్మాణాలను పున: ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం కాపుల కోసం ఏడాదికి రూ.3,580 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కాపుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రూ.38.63 కోట్లతో ఆటో డ్రైవర్ల సేవా పథకం అమలు చేశామని, ఈ పథకం కింద 25,756 మంది కాపు లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధం భృతి పథకం కింద రూ.1.02 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ పథకం ద్వారా 511 మంది కాపులకు లబ్ధి కలిగిందన్నారు.
The post చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
