హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం, గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధుల పాత్రను బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి శ్రీమతి సీతక్క ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ వినియోగం, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. విభాగాల వారీగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు మంత్రికి సమర్పించగా, వాటిలో పలు మార్పులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో తెచ్చుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్లో ఉన్నాయని, అవసరమైన యుటిలిటీ సర్టిఫికేట్లు సమర్పించి వాటిని త్వరగా విడుదల చేయించాలని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఉపాధి హమీ పథకం స్థానంలో కేంద్రం ప్రవేశ పెట్టిన వీబీ జీ రాం జీ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
శాఖలోని అన్ని విభాగాలు తమ ప్రగతి నివేదికలను క్రమం తప్పకుండా రూపొందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. జల సంరక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రానికి ఉత్తమ రాష్ట్రంగా అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే విధంగా అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరచాలని అన్నారు. 99 డేస్ ప్రణాళికల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ వన్ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
The post గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
