Allu Arjun | బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్ 2’ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన బన్నీ తన స్పందనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.సినిమా తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్న అల్లు అర్జున్, ముఖ్యంగా దేశభక్తిని ఎంతో స్టైలిష్గా చూపించిన విధానం అద్భుతంగా ఉందని కొనియాడారు. సినిమా చూస్తున్నంతసేపు ఎంతో ఎమోషనల్గా ఫీలయ్యానని ఆయన వెల్లడించారు. దేశభక్తిని అంతర్జాతీయ స్థాయి మేకింగ్తో చూపించడం ఈ సినిమాకు ప్రధాన బలం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రణ్వీర్ సింగ్ను “మై బ్రదర్” అంటూ సంబోధించిన బన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. మన దేశంలో రణ్వీర్ సింగ్ వంటి వెర్సటైల్ నటుడు ఉండటం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సినిమాలో రణ్వీర్ నటన నిప్పు కణికలా ఉందని, తన ఎనర్జీతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని బన్నీ ప్రశంసించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం చూసి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను కూడా అల్లు అర్జున్ కొనియాడారు. ఈ సినిమాతో ఆదిత్య ధర్ బంతిని స్టేడియం దాటించేశారని కామెంట్ చేశారు. మన దేశంలో ఇలాంటి ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ ఉండటం గర్వకారణమని చెప్పారు. ‘దురంధర్ 2’ ఒక “షో రాకర్” అని బన్నీ అభివర్ణించారు.
సినిమాలోని సాంకేతిక విలువల గురించి కూడా బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమాలో ప్రతి సన్నివేశం ఒక బ్లాస్ట్లా అనిపించిందని, ప్రేక్షకులు చప్పట్లు కొట్టే సందర్భాలకు కొదవ లేదని చెప్పారు. టెక్నికల్ పరంగా సినిమా చాలా రిచ్గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సీనియర్ నటుడు మాధవన్తో పాటు సినిమాలో నటించిన ఇతర నటీనటుల ప్రదర్శనను కూడా అల్లు అర్జున్ ప్రశంసించారు. అందరూ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని చెబుతూ మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. చివరగా ‘దురంధర్ 2’ ఒక స్వచ్ఛమైన భారతీయ కథ అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉందని బన్నీ పేర్కొన్నారు. తన పోస్ట్ చివరలో “జై హింద్” అంటూ ముగించిన ఆయన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
