తన భార్య వివాహేతర సంబంధాన్ని రుజువు చేయడానికి పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యపై ఆరోపణలను నిరూపించడానికి పిల్లలను పావులుగా ఉపయోగించడం సరైంది కాదని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు ఇతర ఆధారాలను సేకరించాల్సిందే గానీ, పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోరకూడదని తేల్చి చెప్పింది.
Also Read: AP High Court: ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు!
ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిల్లల హక్కులు, వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడంను అనుమతించబోదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి హైకోర్టు రూ.3,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని విజయనగరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో కుటుంబ వివాదాల్లో పిల్లల హక్కుల పరిరక్షణ ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది.
