ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది బీఆర్ఎస్సే..
ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే
ఎప్పుడు గోల్ కొట్టాలోమాకు తెలుసు
సిద్దిపేటలో ఎవరో ఎందుకు రేవంతే పోటీచేయాలి
ఆరు గ్యారెంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం
అందుకే చెవుల్లో పూలు పెట్టుకొని నిరసన
ప్రజా సమస్యలపై చర్చించడం సీఎంకు ఇష్టం లేదు
సమస్యలపై మరోవారం సమావేశాలు పెట్టండి
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు చిట్చాట్
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నివేషాలు వేసినా, చివరకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ సీఎం కాలేరని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమల్లో పూర్తిగా విఫలమైందని, అందుకే ప్రజల పక్షాన నిరసన తెలియజేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారని చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని, ప్రజా సమస్యలపై సమగ్రమైన చర్చ జరగాలంటే బడ్జెట్ సమావేశాలను మరో వారంపాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు ఖాయమని, ఏ సమయంలో గోల్ కొట్టాలో బీఆర్ఎస్కు బాగా తెలుసని చెప్పారు. సిద్దిపేట నుంచి రాబోయే ఎన్నికల్లో గెలిచేవారికి మంత్రి పదవి ఇస్తామని ఇటీవల రేవంత్రెడ్డి చేసిన కామెంట్పై మీ స్పందనేమిటని మీడియా ప్రతినిధులు అడుగగా.. సిద్దిపేటలో ఎవరో ఎందుకు, దమ్ముంటే రేవంత్రెడ్డే తనపై పోటీకి దిగాలని సవాల్ విసిరారు.
ఆరు గ్యారెంటీలడిగితే పారిపోతున్న ప్రభుత్వం
బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచిందని, ఆరు గ్యారెంటీలను తుంగలో తొకింది కాబట్టే బడ్జెట్ పేపర్లు చించి, చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలియజేశామని హరీశ్రా వు స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించే వా ళ్లం కదా? అని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి మాటలు ఎకువ చేతలు తకువ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరుగకుండా ప్రభుత్వం పారిపోతున్నదని, సభా నియమాలను తుంగలో తొకుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉంటామని గొప్పలు చెప్పిందని, కానీ, ఆచరణలో దారుణంగా విఫలమైందని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించి, పైసా ఖర్చు చేయకుండా ఆ వర్గాలను వంచించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి ఇబ్బందికర ప్రశ్నలు వచ్చినప్పుడు చర్చ జరుగకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు 16వేలే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని శాసనసభా వేదికగా ప్రశ్నించారని హరీశ్రావు చెప్పారు. దీనిపై సభలో చర్చ జరుగకుండా ప్రభుత్వం బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్క హౌసింగ్ అంశంపైనే ప్రశ్నలు సాగదీసి ప్రశ్నోత్తరాల సమయం ముగిసే వరకు కొనసాగించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పారని, కానీ, శాసనసభలో బుధవారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ 16 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చిందని, వీటిద్వారా 16,978 ఉద్యోగాలు ఇచ్చామని సమాధానం చెప్పిందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి 50,785 ఉద్యోగ నియామక పత్రాలను తామే ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కొత్తగా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పలేక ప్రభుత్వం నీళ్లు నములుతున్నదని ఎద్దేవా చేశారు.
బడుగు, బలహీనవర్గాలకు ఒక్కరూపాయి ఇవ్వలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ఆర్భాటంగా 33 కార్పొరేషన్లను బీసీల కోసం ప్రకటించి చైర్మన్లను కూడా వేసిందని హరీశ్రావు గుర్తు చేశారు. కానీ, వారికి బడ్జెట్లో నిధులు కేటాయించి, ఖర్చు చేయడంలో మాత్రం తీవ్ర వివక్ష చూపిందని ఆధారాలు సహా బయటపెట్టారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 2 శాతమే ఖర్చు చేసి, మిగిలిన 98% నిధులను పకదారి పట్టించారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అతి తకువ నిధులు అంటే 2% నిధులు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. వెల్ఫేర్బోర్డులు, కార్పొరేషన్ల కార్యాలయాలపై స్పష్టత ఇవ్వాలని కోరితే, 33 కార్పొరేషన్లకుగాను 16 కార్పొరేషన్లకే కార్యాలయాలు ఉన్నాయని సమాధానం ఇచ్చారని చెప్పారు. మరో 17 కార్పొరేషన్లకు కనీసం బోర్డుల ఏర్పాటుకు కూడా దిక్కులేదని, ఇది పూర్తిగా ఆయా వర్గాల ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. గత బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కు రూ.1,370 కోట్లు కేటాయించినట్టు చెప్పుకొన్న ప్రభుత్వం రూ.6 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంబీసీ కార్పొరేషన్కు రూ.801 కోట్లు కేటాయించి, రూ.99 లక్షలు మాత్రమే విడుదల చేశారని దుయ్యబట్టారు. రెండేండ్లలో రజక ఫెడరేషన్కు రూ.386 కోట్లు కేటాయించి రూ.1 కోటి ఖర్చు చేసినట్టు చెప్పిందని పేర్కొన్నారు.
‘నాయీ బ్రాహ్మణులకు రూ.280 కోట్లు కేటాయించి, రూ.30 లక్షలు ఖర్చు చేశారు. మున్నూరు కాపు, కృష్ణ బలిజ (పూసల), విశ్వబ్రాహ్మణ, యాదవ, మున్నూరుకాపు, ముదిరాజ్, శాలివాహన, సగర, వాల్మీకిబోయ, మేదర, ఎరుకల, పెరిక, గంగపుత్ర, తదితర కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించి, ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దీన్ని మోసం, దగా అనకపోతే ఏమనాలి?’ అని హరీశ్రావు ప్రశ్నించారు. ‘ఆర్యవైశ్యులకు రూ.25 కోట్లు కేటాయించి, రూపాయి ఖర్చు చెయ్యలేదు. ఎస్టీ కార్పొరేషన్కు రూ.2,730 కోట్లు పెట్టి, రూ.52 కోట్లే ఖర్చు చేశారు. ఎస్సీ కార్పొరేషన్కు రూ.5,403 కోట్లు పెట్టి, రూ.74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మొత్తం 33 వెల్ఫేర్ కార్పొరేషన్లకు కలిపి రూ.14,521 కోట్లు ఇస్తున్నట్టు బడ్జెట్ పుస్తకాల్లో చెప్పారు. కానీ, విడుదల చేసింది మాత్రం రూ.305 కోట్లే. ఇవి కూడా ఆయా కార్పొరేషన్లకు జీతాలకు మాత్రమే సరిపోతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతటి మోసం, దగా చేస్తుంటే బడ్జెట్ పుస్తకాలను చింపివేయకపోతే ఏం చేయాలి? విలువలేని మాటలకు నిరసన తెలుపవద్దా? అని ప్రశ్నించారు. చెవిలో పువ్వులు పెట్టుకొని నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చివరకు జర్నలిస్టులను కూడా మోసం చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రానికి చిన్నచూపు
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదనే విషయాన్ని బీఆర్ఎస్ మొదటినుంచీ చెప్తూనే ఉన్నదని హరీశ్రావు గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ తకువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ను స్వాగతిస్తున్నామని, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభమేనని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ ఎప్పుడో జరుగాల్సిందని, మహిళా రిజర్వేషన్లు అమలైతే స్వాగతిస్తామని చెప్పారు. మ హిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేశారు.
సభా నిర్వహణ చేతకావడం లేదు
ప్రజా సమస్యలపై చర్చించేందుకు జీరో అవర్ కూడా కాంగ్రెస్ సర్కార్ నిర్వహించడం లేదని, సభను వారం రోజులపాటు పొడిగించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. చిన్నచిన్న కార్యక్రమాల కోసం గంటల తరబడి సభను వాయిదా వేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీని నడిపించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సభా నియమాలను పూర్తిగా తుంగలో తొకుతున్నారని మండిపడ్డారు. చనిపోయిన విద్యుత్తు ఉద్యోగుల కుటుంబాలకు చెక్ ఇచ్చేందుకు 3 గంటలు సభను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిరోజూ జీరో అవర్ తీసుకుంటామని చెప్పి, రెండు రోజుల నుంచి జీరో అవర్ తీసుకోవడం లేదని విమర్శించారు. సీఎం కోసం ఒక రోజు 4 గంటలకే వాయిదా వేస్తారని, మరోరోజు ఆయన ఒక విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి సహాయం చేయడానికి వెళ్తే మూడున్నర గంటలపాటు వాయిదా వేశారని, ఇంకోరోజు ఆయన ఢిల్లీ నుంచి వచ్చే వరకు వాయిదా వేస్తారని, మరోసారి ఆర్థిక మంత్రి సభలో మాట్లాడేందుకు ప్రిపేర్ కాలేదని గంటన్నర వాయిదా వేశారని పేర్కొన్నారు.
