Niharika | మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల యాంకర్గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు నిర్మాతగా విజయవంతంగా దూసుకుపోతున్నారు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, సినిమాలతో తనదైన ముద్ర వేసుకుంటున్న నిహారిక తాజాగా నిర్మించిన ‘రాకాస’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఈ ఈవెంట్లో మాట్లాడిన నిహారిక కొణిదెల తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. నేను ‘కమిటీ కుర్రాళ్ళు సినిమా చేసినప్పుడు 15 మంది కొత్తవాళ్లను పరిచయం చేశాను. అప్పుడు ఎందుకు కొత్తవాళ్లతో చేస్తున్నావు, తెలిసిన వాళ్లతో చేయొచ్చుకదా అన్నారు. ఇప్పుడు ‘రాకాస’ చేస్తుంటే మళ్లీ అదే తరహా సినిమా చేయొచ్చుకదా, ఈ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా ఎందుకు అంటున్నారు అని తెలిపారు.
ఇదే సమయంలో, తాను తదుపరి చిత్రంగా వరుణ్ తేజ్తో సినిమా చేస్తుంటే కూడా విమర్శలు వస్తున్నాయని వెల్లడించారు. చిన్నవాళ్లతో చేయొచ్చుకదా, ఫ్యామిలీ వాళ్లతో ఎందుకు చేస్తున్నావు అంటున్నారు. నేనేం చేసినా నన్ను అనేవాళ్లు ఉంటారు. నేను చేయాల్సింది చేస్తూనే ఉంటా అని స్పష్టం చేశారు. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్, ఓటీటీ వేదికలపై పలువురు ప్రశంసలు అందుకున్న ప్రాజెక్టులు అందించారు. ముఖ్యంగా ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించారు.
ఇప్పుడు ఆమె నిర్మాణంలో తెరకెక్కిన ‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విభిన్న కథాంశంతో, విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ‘రాకాస’ తర్వాత వరుణ్ తేజ్తో ‘బరి’ అనే మరో ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు నిహారిక సిద్ధమవుతున్నారు. నిర్మాతగా ఆమె ఎంపికలు, ధైర్యమైన నిర్ణయాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనపై వస్తున్న విమర్శలకు నిహారిక ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగుతానన్న ఆమె స్పష్టత అభిమానులను ఆకట్టుకుంటోంది.
