అమరావతి : ‘జలమే జీవం… జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యలు నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భూమి మీద మనిషికి అవసరం అయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉందన్నారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోక పోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై ఒక రోజు వర్క్ షాపు కానూరులోని ఏపీఎస్ఐఆర్డీ భవన్ లో మొదలైంది. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుందని అన్నారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగు పడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానం మెరుగవడానికి గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులే జీవనాధారం అని స్పష్టం చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా దేశంలో ముందు వరుసలో ఉండటానికి మనకు సమృద్ధిగా ఉన్న నీటి వనరులే కారణం అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. అలాంటి నీటిని సంరక్షించుకునే పెద్ద సవాల్ ఇప్పుడు మన ముందుందని అన్నారు.. ఉపరితల జలాలను జాగ్రత్తగా కాపాడుకోవడం, రానురాను తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడు కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని కోరారు. భవిష్యత్తును సుందరంగా నిర్మించు కోవాలంటే ప్రతి నీటి చుక్క ఎంత విలువైందో తెలుసు కోవాలన్నారు.
The post జలమే జీవనాధారం లేకపోతే మనుగడ కష్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
