హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో రాచరిక పాలన సాగిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన సుమారు 10 వేల మంది కాంట్రాక్టర్ల కడుపు కొట్టారని ఆరోపించారు. జివో నెం 17 తెచ్చి,పిల్లలకు అందించే నోట్ బుక్స్, యూనిఫాం, ట్రంక్ బాక్సు,ప్లేటు, గ్లాస్ వంటివి అందించడానికి దేశ వ్యాప్తంగా టెండర్లు ఆహ్వానించడం దారుణమన్నారు. మీ అస్మదీయులకు గుట్టు చప్పుడు కాకుండా కట్టబెట్టడం ఎలా సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ విద్యార్థులకు వస్తువుల సరఫరా చేయడానికి తెలంగాణ కాంట్రాక్టర్లు, చిన్న తరహా పరిశ్రమలు పనికి రావా అని ప్రశ్నించారు. ఎఐసిసి కి ఏటిఎం గా పని చేసే మీ అనుచరులకు కాంట్రాక్టర్లు ఇవ్వడానికే , వారికి మేలు చేకూర్చేందుకే జీవో 17 తీసుకు వచ్చారంటూ మండిపడ్డారు. టెండర్ లో పాల్గొనడానికి రూ. 50 వేలు, రూ. 25 వేల ఫీజు చెల్లించాలా? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక సర్కస్, సినిమా నడిపిస్తున్నారా అంటూ ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు చెప్పినా జీవో 17 ను మార్చరా? చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలు ఉత్త మాటలేనా? అని ఫైర్ అయ్యారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాడు జీవో నెం 17 రద్దు చేసి,ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేసి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
The post రేవంత్ రెడ్డి నిర్వాకం ఆర్ఎస్పీ ఆగ్రహం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
