హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నాఅర్హత ఉంటే ఇల్లు ఇస్తాం అని వెల్లడించారు. సాదా బైనామాల దరఖాస్తుల పై ఆర్డీవోలదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఈరోజు హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జిల్లాల ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గాల వారీగా హౌసింగ్ , రెవెన్యూ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై అక్కడికక్కడే స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని మానవీయ కోణంలో అమలు చేస్తున్నదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశాం అని తెలిపారు మంత్రి. ప్రభుత్వం పేదల కోసం చేసే ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా మరింత విస్తృతంగా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి, జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాం అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పథకం అమలులో వేగం పెంచడానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం అన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారు , ఇప్పుడు దరఖాస్తుకున్నాకూడా అర్హత ఉంటే , ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తాం అని తెలిపారు. వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేని వారు, తమకు ఇల్లు అవసరం లేదని తెలియచేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని ఆదేశించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
The post దరఖాస్తు చేసుకుంటే చాలు ఇల్లు ఇస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
