అమరావతి : రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని… అటు ఆదాయం, ఇటు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఏపీఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ ప్రవీణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 1,938 మిలియన్ టన్నుల వరకు ఐరన్ ఓర్ నిల్వలు కలిగి ఉండటంతో అధిక ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని సమీక్షలో సీఎం అన్నారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా సంస్థ 17.8 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తుండగా, రాయలసీమలో జేఎస్డబ్ల్యు సంస్థ కూడా భారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని సీఎం అన్నారు.
2035 నాటికి వీటి సామర్ధ్యం ఏడాదికి 20 మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఐరన్ ఓర్ బ్లాకులకు గాను… ఇప్పటికే కేటాయించినవి మినహా, మిగిలిన బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించాలని స్పష్టం చేశారు. 2030 నాటికి ఏడాదికి 30 మెట్రిక్ టన్నులు, 2035 నాటికి ఏడాదికి 113 మె.ట. ఇనుప ఖనిజం ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలన్నారు. రానున్న రోజుల్లో ఐరన్ ఓర్ వినియోగం 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని, రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఇనుప ఖనిజం లభ్యత అద్భుత అవకాశంగా చెప్పారు. ఈ రంగంలో రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. అలాగే, తక్కువ గ్రేడ్ మాగ్నటైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నిర్దేశించారు. ఖనిజాల అన్వేషణ వేగంగా చేపట్టడంతో పాటు, లీజుల అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.
The post రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
