హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది.
1961, జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లన్న. అశువు కవిత్వ చెప్పడంలో దిట్ట అయిన అందెశ్రీ.. ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో జాతిని జాగృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’తోపాటు ఎన్నో పాటలు రాశారు. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కరం, లోక్నాయక్ పురస్కారం అందుకున్నారు.
