మొంథా తుపాను పెనువిపత్తని… రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గంలో వెళ్లి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, తుపాను బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు, పరిహారం అందించారు.
ఈ సందర్భంగా మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశాం. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం’’ అని సీఎం తెలిపారు.
ప్రోటోకాల్ పక్కన పెట్టి తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల కోసం ప్రోటోకాల్ను పక్కనపెట్టారు. సీఎం కాన్వాయ్ వెహికల్లో కాకుండా ఇన్నోవా కారులోనే బాధితుల వద్దకు వెళ్లారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాల్సి ఉన్నా సాధారణ వాహనంలోనే బాధితుల దగ్గరకు వెళ్లారు. అల్లవరం మండలంలోని ఓడరేవుల సమీపంలో ఉన్న పునరావాస శిబిరాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. పునరావాస బాధితులకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు.
దాదాపు అరగంట సేపు పునరావాస శిబిరంలోనే గడిపారు. పునరావాస శిబిరంలో వసతుల కల్పనపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అరగట్ల పాలెం, బెండమూరు లంక గ్రామాల్లో నీట మునిగిన పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతులను కలిసి మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, గుర్రపు డెక్క సమస్య ఉందని, వాటిని క్లియర్ చేయాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారు. రైతులు చెప్పిన విధంగా డ్రైన్లను క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
నవంబరు 2 నుండి సీఎం చంద్రబాబు లండన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన చేయనున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు లండన్ (London)లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది. ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో నవంబరులో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. లండన్లో రోడ్డు షోతో పాటు సీఐఐ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. లండన్ నుంచి మళ్లీ తిరిగి నవంబర్ 6వ తేదీన అమరావతికి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
The post CM Chandrababu: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
