కొడంగల్లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులు పెరిగారని చెప్పారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడి అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ను పరిశీలించారు. మిడ్డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
‘‘జీవితాల్లో మార్పు రావాలంటే పిల్లల్ని చదివించాలి. కొడంగల్లో రూ.5వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో తొలి సైనిక్ స్కూల్ను ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నాం. 16 నెలల్లోగా కొడంగల్ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. వెయ్యి ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేశాం. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులకు కూడా యజమానులను చేశాం. అదానీ, అంబానీలతో పోటీపడేలా వారిని ప్రోత్సహిస్తున్నాం. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
మూడు నెలల్లో కొడంగల్లోని ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు అందిస్తాం. లగచర్ల పారిశ్రామికవాడకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకొస్తాం. తెలంగాణ నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం. రాబోయే కొన్ని నెలల్లో కొడంగల్ రైల్వే పనులు ప్రారంభమవుతాయి. నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. 3, 4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచ్లుగా ఎన్నుకోవాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.___
The post CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా కొడంగల్ – సీఎం రేవంత్రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
