Harish Shankar | హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్తో పాటు చిత్ర బృందం మొత్తం హాజరైంది. స్టేజ్పై పలువురు నటీనటులు, టెక్నీషియన్స్ తమ అనుభవాలను పంచుకుంటూ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దాదాపు 35 నిమిషాల పాటు మాట్లాడి అభిమానులను ఉత్సాహపరిచారు. అయితే ఈ భారీ ఈవెంట్లో ఒక విషయం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా మ్యూజిక్ డైరెక్టర్లైన దేవిశ్రీ ప్రసాద్, థమన్ ఇద్దరూ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు తలెత్తాయి.
ఈ చిత్రానికి మొదటగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుంచారు. అయితే చివరి దశలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం థమన్ కూడా ఈ ప్రాజెక్ట్లో చేరినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దేవిశ్రీ అందించిన పాటలు, థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిసి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కనిపించకపోవడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల ‘ఎత్తరా కాలరే ఎత్తరా’ పాట విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్కు వస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో దేవిశ్రీతో పాటు థమన్ కూడా వస్తారని అభిమానులు భావించారు. కానీ చివరికి ఇద్దరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
ఈ నేపథ్యంలో థమన్ ఎందుకు రాలేదన్న విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వివరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్ సమయంలో కొందరి పేర్లు చెప్పడం మర్చిపోయానని ఆయన తెలిపారు. హీరోయిన్ రాశీ ఖన్నా గురించి మాట్లాడుతూ, ఆమె స్క్రిప్ట్ పూర్తిగా వినకుండానే షూటింగ్కు వచ్చిందని, పవన్ కళ్యాణ్తో పని చేయాలనే ఆసక్తితో సినిమా అంగీకరించిందని చెప్పారు. సినిమాలో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఆమె పాత్ర పెద్ద ఆకర్షణగా ఉంటుందని, పవన్ కళ్యాణ్తో వచ్చే కామెడీ సన్నివేశాల్లో అద్భుతంగా నటించిందని హరీష్ శంకర్ ప్రశంసించారు.ఇక థమన్ గురించి కూడా హరీష్ శంకర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమా కోసం థమన్ ఇప్పటికే పూర్తి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసి, ఓవర్సీస్ రిలీజ్ కోసం కంటెంట్ పంపించే పనిలో బిజీగా ఉన్నారని చెప్పారు. తాను ఒక ప్రత్యేక పరిస్థితుల్లో థమన్ను సంప్రదించగా, ఎంతో సహాయం చేశాడని ఆయన తెలిపారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్కు రావాలని థమన్ను తాను కోరినప్పటికీ, “ఈ సినిమాకి ప్రధాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. నేను కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను. అలాంటప్పుడు స్టేజ్పై రావడం సరైంది కాదు. అంతేకాదు సినిమా విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి నాకు మ్యూజిక్ పూర్తి చేయడానికే సమయం సరిపోవడం లేదు” అని థమన్ చెప్పినట్లు హరీష్ శంకర్ వెల్లడించారు. థమన్ మాటలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఆయన వినయం, సంస్కారం చూసి చాలా నేర్చుకున్నానని హరీష్ శంకర్ అన్నారు. థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు భారీ హైలైట్ అవుతుందని కూడా ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
