HIV Positive | రాంచీ : జార్ఖండ్లోని చాయ్బసాలో దారుణం వెలుగు చూసింది. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తోంది. స్థానిక బ్లడ్ బ్యాంక్లో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియా వ్యాధితో బాధపడుతున్న తమ ఏడేండ్ల కుమారుడికి హెచ్ఐవీ సోకిందని శుక్రవారం ఓ బాధిత కుటుంబం వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి.. విచారణ నిమిత్తం ఉన్నతస్థాయి వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ వైద్య బృందం విచారణ జరపగా, మరో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. వైద్య బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దినేశ్ కుమార్ సదర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసీమియా రోగికి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ క్రమంలో బ్లడ్ బ్యాంకును పరిశీలించాం. బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని, దానిపై విచారణ చేస్తున్నామన్నారు. లోపాలను సరి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని డాక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు.
