HMDA | సిటీబ్యూరో, మార్చి 8(నమస్తే తెలంగాణ) : వేల కోట్లు విలువ చేసే భూములను కలిగిన హెచ్ఎండీఏ.. వాటిని పరిరక్షించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. 11 జిల్లాల్లో విస్తరించిన ఈ సంస్థకు సుమారు 6వేల ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ను కలిగి ఉంది. అధికారంలోకి రావడంతోనే హెచ్ఎండీఏ వద్ద ఉన్న విలువైన భూములను విక్రయిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. వాటిని పరిరక్షించే విషయంపై దృష్టి పెట్టడం లేదు. కేవలం ఉన్న భూములను వేలం వేయాలి. ఖజానా నింపుకొనే లక్ష్యంతో అడుగులు వేస్తుందే తప్ప.. హెచ్ఎండీఏకు ఉన్న భూములను కాపాడుకునే ప్రణాళికలను అమలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
11 జిల్లాల్లో విస్తరించిన హెచ్ఎండీఏకు అవుటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా 5-10 కిలోమీటర్ల పరిధిలోనే వేల ఎకరాల భూములను రెవెన్యూ శాఖ కట్టబెట్టింది. కానీ వాటిని పరిరక్షించుకోవడంలో హెచ్ఎండీఏ మీనమేషాలు వేస్తుండటంతో.. ఇప్పటికే వందలాది ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. అయితే రెవెన్యూ వివాదాలపై దృష్టి పెట్టకపోవడంతో ఇప్పటికీ పలు కోర్టు పరిధిల్లో కేసుల విచారణ సాగుతున్నది. ఈ క్రమంలో హెచ్ఎండీఏకు ఉన్న భూములన్నింటినీ డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలోనే జీఐఎస్ మ్యాపింగ్, డిజిటల్ హద్దుల నిర్ధారణకు శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో విజయవంతం చేశారు. ఎన్నికల కారణంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని విస్మరించింది. దీంతో వేల కోట్లు రూపాయలు విలువ చేసే భూములకు రక్షణ లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
హెచ్ఎండీఏకు ఉన్న ఆస్తులు, విలువైన భూములు, వాటిపై నడుస్తున్న కేసులన్నింటినీ హెచ్ఎండీఏలోని ఎస్టేట్ విభాగం పర్యవేక్షిస్తున్నది. వీటితోపాటు లీజు వ్యవహారాలు కూడా ఈ విభాగం ఆధీనంలో నడుస్తున్నది. అదే విధంగా రియల్ ఎస్టేట్ సంస్థలు మార్టిగేజ్ చేసే ప్లాట్లకు కూడా రక్షణ లేకుండా పోవడంలో ఎస్టేట్తోపాటు, హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్ విభాగం వైఫల్యమేనన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన మియాపూర్, జవహర్ నగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏకు ఉన్న వందలాది ఎకరాల ల్యాండ్ పార్శిళ్లను నిర్లక్ష్యం చేయడంతో.. యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. అయినా పట్టించుకోకపోవడంతో కబ్జాదారులకు కోట్ల రూపాయాలను తెచ్చిపెడుతున్నాయి. ఇక ఆక్రమణల పర్వంలోనూ హెచ్ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం తోడవ డంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు. అందుకు మియాపూర్ ప్రాంతంలో ఉన్న భూముల్లో వెలిసిన కంచెలే ఉదాహరణ కాగా, పాత అనుభవంతోనైనా భూములను పరిరక్షించడంపై దృష్టి పెట్టడం లేదు.
డిజిటల్ ఫెన్సింగ్ నిర్ణయంలో విఫలం
మియాపూర్ గుడిసెల ఘటనతో అన్ని భూములను ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతోపాటు, డిజిటల్ మ్యాపింగ్, జీఐఎస్ ఫెన్సింగ్ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కొన్నింటిని ఇనుప కంచెలు ఏర్పాటు చేసిన యంత్రాంగం కీలకమైన డిజిటల్ ఫెన్సింగ్ నిర్ణయించడంలో విఫలైమంది. దీంతోనే ఈ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారిందనీ, ఇదే కబ్జాదారులకు సానుకూలమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం హెచ్ఎండీఏ ఎస్టేట్ విభాగం వద్ద కూడా భూముల చిట్టాపై సమాచారం లేదంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది తెలిసిపోతున్నది.
