Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్కు పెద్దపీట వేసి 24 గంటల కరెంట్ ఇస్తే.. కాంగ్రెస్ పాలనలో వేసవి ఆరంభం కాకముందే గ్రేటర్లో కరెంట్ కోతలు షురూ అయ్యాయి. రోజుకు ఐదారుసార్లు కరెంట్ పోయి రావడం, వోల్టేజీ హెచ్చుతగ్గులతో గృహోపకరణాలు దగ్ధమవుతున్నాయి. విద్యార్థులు , వర్క్ఫ్రం హోమ్ ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. అప్రకటిత కరెంట్ కోతలతో నానా ఇబ్బందులు పడుతున్నామని నగర వాసులు మండిపడుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన 2,896 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా.. ఈ సంవత్సరం అదే రోజున వినియోగం 3,383 మెగావాట్లకు చేరినట్లుగా అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలో పది సర్కిళ్లు ఉండగా 65లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 58లక్షల గృహ కనెక్షన్లు, 8లక్షల వరకు వాణిజ్య పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 3,512 మెగావాట్లు కాగా, విద్యుత్ వినియోగం 72 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 6న విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 3,509 మెగావాట్లు కాగా వినియోగం విద్యుత్ డిమాండ్ 67 మిలియన్ యూనిట్లకు చేరింది. జనవరి నెల చివరి వారంలో రోజూ సగటున డిమాండ్ 57 ఎంయూలు ఉన్నది.
కేవలం పదిరోజుల వ్యవధిలోనే పది ఎంయూలు పెరగడం గమనార్హం. మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో గృహ, వాణిజ్య విద్యుత్ మీటర్లు అప్పుడే గిర్రున తిరుగుతున్నాయి. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం గరిష్ఠంగా డిగ్రీలు నమోదయ్యాయి. కేవలం పగలే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం పెరిగింది. అనధికార కోతలు అమలవుతుండడంతో సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది.
విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్..
గ్రేటర్లో కరెంట్ పోవడమనేది సర్వసాధారణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కోతల ప్రభావం ఎక్కువగానే ఉండి బయటకు కనిపిస్తున్నా.. నగరంలో మాత్రం అప్రకటిత కరెంట్ కోతలతో అడపాదడపా కరెంట్ తీసేస్తూ మెయింటెనెన్స్ అంటూ కరెంట్ సిబ్బంది చెప్పుకుంటున్నారు. విద్యుత్ వినియోగం పెరుగుతుండడంతో ఫీడర్లపై లోడ్ పెరిగి తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. నగరంలో ప్రతి చోటా రోజుకు నాలుగైదు సార్లు కరెంట్ పోయిరావడంతో ప్రజలు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు, వర్క్ఫ్రం హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు వైఫై చాలా కీలకం కాగా కరెంట్ కోతల కారణంగా ప్రతిసారి వైఫై ఆఫ్ అయి ఆన్ అయ్యే వరకు తమకు కాల్స్లో సమస్య వస్తున్నదని ఐటీ ఉద్యోగులు నెట్ వేదికగా గగ్గోలు పెడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో కనుక్కుందామని ఫోన్ చేస్తే స్పందన లేదని వారు ఆరోపిస్తున్నారు.
అనధికార కోతలు& సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నగరంలో ప్రతి సర్కిల్లో మరమ్మతులు చేపట్టారు. అయితే వీటి కోసం ఎల్సీలు తీసుకుని చేస్తున్నారు. ముందస్తుగానే ఆయా సర్కిళ్ల అధికారులు కరెంట్ కోతల సమయాన్ని ప్రకటిస్తున్నారు. శనివారం ఎల్సీల సమయం కాకుండా అధికారులు చెప్పిన సమయంలో లేకుండా మిగతా సమయాల్లో కరెంట్ పోవడంతో నగరవాసులు మండిపడుతున్నారు. ఈ అనధికార కోతలకు మెయింటెనెన్స్ కారణమని సిబ్బంది చెబుతూనే చెట్ల కొమ్మలు తొలగిస్తున్నామని, మరమ్మతులంటూ ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో కరెంట్ తీసేస్తున్నారు.
పలు ఫీడర్ల పరిధిలోఅర్ధరాత్రి తర్వాత సరఫరా నిలిచిపోతుంటే.. మరికొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచి .. ఇంకొన్ని చోట్ల మధ్యాహ్నం వరకు సరఫరా నిలిచిపోతున్నది. తమకు ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరిస్తున్నామంటున్న సిబ్బంది.. బస్తీల్లో మాత్రం గంటల తరబడి సరఫరా నిలిచిపోయినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దక్షిణ డిస్కం మాత్రం ఈ అనధికారిక కోతలను కొట్టిపారేస్తున్నది. డిమాండ్కు తగినంత సరఫరా ఉందని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది.
