ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకొందని బుధవారం విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్-2025 నివేదికలో వెల్లడైంది. గతేడాది పదో స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది. వార్షిక వృద్ధిలో చైనా, రష్యాల తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది. దేశంలో ఈ ఏడాది అటవీ విస్తీర్ణం 1,91,000హెక్టార్లు(0.27%) పెరిగింది. చైనాలో 0.77%, రష్యాలో 0.11% వృద్ధి నమోదైంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ పెద్దఎత్తున అడవుల పెంపకం, అటవీ సంరక్షణ ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ‘‘అటవీ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో భారత్ పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి రావడం ఓ పెద్ద విజయం. సుస్థిర అటవీ నిర్వహణ, పర్యావరణ సమతౌల్యానికి భారత్ కట్టుబడి ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం’’ అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4.14 బిలియన్ హెక్టార్ల(32 శాతం) అటవీ ప్రాంతముందని నివేదికలో పేర్కొంది. దీనిలో సగానికి(54 శాతం) పైగా రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనాల్లో కేంద్రీకృతమైంది. ఆస్ట్రేలియా, కాంగో, ఇండోనేసియాలను అనుసరిస్తూ మొదటి 10 అటవీ సంపన్న దేశాల్లో భారత్ కూడా నిలిచింది.
అమిత్ షాకు శుభాకాంక్షల వెల్లువ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 61వ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అంతర్గత భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రతి భారతీయుడూ భద్రతతో కూడిన గౌరవప్రదమైన జీవితం గడపడానికి అమిత్ షా అహరి్నశలూ కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రజాసేవ పట్ల అమిత్ షా అంకితభావం, కష్టపడిపనిచేసే తత్వం అందరినీ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
అమిత్ షాకు కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జగత్ప్రకాశ్ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, బిహార్ సీఎం నితీశ్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా 1964 అక్టోబర్ 22న ముంబైలో జని్మంచారు. తొలిసారిగా 2002లో గుజరాత్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హోంశాఖ సహా పలు కీలక శాఖల మంత్రిగా సేవలందించారు. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అత్యంత కీలకంగా వ్యవహరించారు. నంబర్ టూ స్థానానికి చేరుకున్నారు. 2014 జూలైలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2019లో కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన మంచి వ్యూహకర్తగా, మోదీకి నమ్మినబంటుగా పేరుగాంచారు.
The post India: అటవీ విస్తీర్ణంలో భారత్కు తొమ్మిదో స్థానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
