Iran Warning | న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ గురువారం తీవ్రంగా స్పందించింది. శాశ్వత అవమానాన్ని, పశ్చాత్తాపాన్ని, లొంగుబాటును అమెరికా చవిచూసేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ నౌకదాళం, వైమానిక దళం దారుణంగా క్షీణించిపోయాయని, ఆ దేశ నాయకత్వం భారీ నష్టాలను ఎదుర్కొందంటూ ట్రంప్ బుధవారం రాత్రి చేసిన ప్రసంగానికి ఇరాన్ ఈ విధంగా స్పందించింది. ఇరాన్ సైనిక సదుపాయాలను, సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు ట్రంప్ చేసిన ప్రకటనను ఖతమ్ అల్ అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి తోసిపుచ్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ తెలిపింది.
ఇరాన్ సైనిక బలంపై అమెరికా నిఘా అసంపూర్ణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ విశాల సామర్థ్యాల గురించి అమెరికాకు తెలియదని ఆయన చెప్పారు. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించకుండా ఇరాన్ను నాటకీయంగా కట్టడి చేసినట్లు ట్రంప్ చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. మీ సైనిక శక్తి, ఆయుధాలపై మీ నిఘా అసంపూర్ణం. మా విశాల వ్యూహాత్మక సామర్థ్యం గురించి మీకు ఏమీ తెలియదు. మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేశామని భ్రమపడవద్దు అని ఇరాన్ ప్రతినిధి స్పష్టం చేశారు. అమెరికానే దురాక్రమణకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రతీకార చర్యలు కొనసాగిస్తామని ప్రతినిధి హెచ్చరించారు. తమ దేశంపై ప్రారంభించిన దురాక్రమణకు మీరు మూల్యం చెల్లించాల్సిందేనని ఆయన అన్నారు.
