జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో విషాదం (Jaipur) చోటుచేసుకున్నది. జైపూర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో (Jaipur School) నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల నాలుగో అంతస్తు పైనుంచి దూకి చనిపోయింది. 9 ఏండ్ల బాలిక నాలుగో అంతస్తు గ్రిల్ ఎక్కి దూకినట్లు అక్కడ ఉన్న కెమెరాలో రికార్డు అయింది. అయితే కింద మాత్రం ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జైపూర్లోని నీరజా మోదీ స్కూల్లో 9 ఏండ్ల బాలిక 4 వ తరగతి చదువుతున్నది. శనివారం మధ్యాహ్నం ఆ బాలిక స్కూలు బిల్డింగ్ 4వ అంతస్తు పైనుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను పాఠశాల సిబ్బంది సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలానికి పరిశీలించారు. అయితే అక్కడ ఎలాంటి ఆనవాలు కనిపించలేదు. దీంతో బాలిక 47 అడుగుల పై నుంచి పడిందని యాజమాన్యం చెప్పినప్పటికీ.. ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వచ్చేలోపే రక్తపు మరకలను ఎందుకు తూడ్చేశారనే విషయమై పోలీసులు ఆరాతీస్తున్నారు.
