KTR : హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని… హైడ్రా కూల్చివేతలతో అన్యాయానికి గురైన బాధితులందరికీ అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం… పేదవాళ్లకు ఒక న్యాయం’ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ (KTR) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘హైడ్రా పేరుతో ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలకు ఎంతోమంది బాధితులుగా మారారు. చాంద్రాయణగుట్టలో పాఠశాల భవనాన్ని కూడా కూలగొట్టారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా కట్టడాలే కనిపించేవి. హైదరాబాద్లోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాం. వైట్హౌస్ను తలదన్నేలా సచివాలయం, దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించాం. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టాం. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం.
రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త నిర్మాణం కూడా చేపట్టలేదు. రేవంత్రెడ్డి చేసిన పని కూలగొట్టడమే. పేదవాడికి ఒక న్యాయం.. ఉన్నవాడికి ఒక న్యాయం… ఇదే ఈ ప్రభుత్వం పనితీరు. హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ రోజు చాలా మంది బిల్డర్ల పేర్లు చెప్పారు. ఏ బిల్డర్నూ మేం ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పేదల ఇంటికి వచ్చిన బుల్డోజర్… ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభుత్వం చెప్పాలి. ఎఫ్టీఎల్ పరిధిలో కడితే ఎవర్నీ వదలబోమని చెప్పినా… పెద్దలను వదిలేశారు. చెరువును పూడ్చి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కట్టారు. మరో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా హిమాయత్సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. రేవంత్రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లు నిర్మించుకున్నారు. వీళ్లను ముట్టుకునే ధైర్యం హైడ్రా చేస్తుందా? అందుకే హైడ్రాను మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.
KTR – చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా… పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ ఘటన జరిగింది. తాండూరు డిపోకు చెందిన బస్సు సుమారు 70 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఆ సమయంలో కంకరతో వెళ్తున్న టిప్పర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కంకర పడిపోవడంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల-వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అధికారులు రంగంలోకి ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read : Divya Gautam: బిహార్ ఎన్నికల బరిలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి
The post KTR: పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు – కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్  | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
