Life Science | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ విజన్.. కేటీఆర్ మిషన్.. వెరసి ఫార్మా, లైఫ్ సైన్సెస్, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ దూరదృష్టితో మొగ్గతొడిగిన ప్రతీ ఆలోచన.. ఇప్పుడు ఫలాలనిస్తున్నది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మంగళవారం విడుదల చేసిన తాజా నివేదికే ఇందుకు రుజువు. జీవ విజ్ఞానం, బయో టెక్నాలజీ, అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీల కేంద్రంగా హైదరాబాద్ రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్నట్టు తాజాగా తేలింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ఆకర్షణలోనూ తెలంగాణ ఎంతో ముందున్నట్టు రూఢీ అయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే కీలక శక్తిగా దక్షిణాది రాష్ర్టాలు ఎదుగుతున్నాయని, దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో 38-40 శాతం వరకు వాటా వీటిదేనని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేరళలోని కొచ్చిలో మంగళవారం సీఐఐ నిర్వహించిన దక్షిణ భారతదేశ వార్షిక సదస్సు 2026 సందర్భంగా విడుదల చేసిన ‘రైజింగ్ సౌత్-నెక్స్ట్ వేవ్ ఆఫ్ గ్రోత్’ నివేదికలో తేటతెల్లమైంది.
ఈ నివేదికలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు దేశ ఆర్థిక ఉత్పత్తిలో కీలక వాటాను కలిగి ఉన్నాయని పేరొన్నారు. తయారీ, సాంకేతిక రంగం, ఎగుమతులు, ఆవిషరణల్లో దక్షిణాది రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయని వివరించారు. దేశంలో అత్యంత చురుకైన ప్రాంతంగా, అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానమైన ఆర్థిక కేంద్రంగా దక్షిణాది ఎదిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ జీవ విజ్ఞానం, ఫార్మా, బయో టెక్నాలజీ, అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీల కేంద్రంగా అభివృద్ధి చెందినట్టు వెల్లడించారు.
జీవ విజ్ఞాన రంగానికి హబ్గా తెలంగాణ
సీఐఐ నివేదిక ప్రకారం.. తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ ఔషధ, జీవ విజ్ఞాన రంగానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. తద్వారా జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది ఆధిపత్యం పెరుగడానికి సాయపడింది. ఇక, దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) సింహభాగం దక్షిణాది రాష్ర్టాల్లోనే అత్యధికంగా ఉన్నట్టు తేలింది. ఇందులో హైదరాబాద్ నగరానిది కీలక పాత్ర అని స్పష్టమైంది. అలాగే దేశంలోని యూనికార్న్ స్టార్టప్లలో సుమారు 30 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని సీఐఐ నివేదిక పేరొంది. ఇక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)లో తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు కూడా ముందంజలో ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రముఖ విద్యా సంస్థలు ఈ వృద్ధికి బలంగా నిలుస్తున్నట్టు వివరించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే..
సీఐఐ తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించిన జీనోమ్ వ్యాలీ అభివృద్ధి, జీసీసీలకు ప్రాధాన్యత తదితర అంశాలు బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతోనే సాధ్యపడిందన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పారిశ్రామిక అనుకూల విధానాలతో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. జీవవిజ్ఞానం, బయోటెక్నాలజీ, ఫార్మా, డిజిటల్ టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి. ఇక జీనోమ్ వ్యాలీలో ఏర్పాటైన ఔషధ కంపెనీలకైతే లెక్కేలేదు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) సైతం హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో కొలువుదీరాయి. రాష్ట్రంలోని అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలతో విస్తరణబాట పట్టాయి. దీంతో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరిగి దేశంలోని అనేక రాష్ర్టాలకు చెందిన నైపుణ్యంగల యువత ఇక్కడికొచ్చి ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. తాజాగా సీఐఐ విడుదల చేసిన నివేదిక కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతికి అద్దం పట్టింది.
జీసీసీలకు కేరాఫ్ హైదరాబాద్
కొత్త రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తేనే కంపెనీలు మనదగ్గరకు వస్తాయని కేసీఆర్ ప్రభుత్వం ముందే గుర్తించింది. ఈ క్రమంలోనే ఐటీ మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కంపెనీలకు కావాల్సిన ప్రోత్సాహకాలను అందించింది. టీహబ్, టీహబ్ 2.0 పేరిట స్టార్టప్ ఇంక్యుబేటర్ల ఏర్పాటు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీహబ్తో పాటు మరీ ముఖ్యంగా ‘టాస్క్’ వంటి కార్యక్రమాలతో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన మానవ, సాంకేతిక వనరులను కల్పించింది. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను (జీసీసీ) హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి క్యూకట్టాయి.
జీసీసీలను ఆకర్షించడంలో ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరును తోసిరాజని హైదరాబాద్ ముందువరుసలో నిలిచిందంటే కేసీఆర్ ప్రభుత్వం వేసిన అప్పటి ‘ఐటీ’ పునాదులేనని చెప్పకతప్పదు. దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా జీసీసీ ఎకో సిస్టమ్లుండగా.. హైదరాబాద్లోనే దాదాపు 400 వరకూ జీసీసీలు ఉన్నాయి. అంటే దేశంలో కొత్తగా ప్రారంభించే ప్రతీ 100 జీసీసీల్లో 20 సెంటర్లు నగరంలోనే కొలువుదీరుతున్నాయి. ప్రస్తుతం నగరంలోని మొత్తం జీసీసీల్లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు.
జీనోమ్ వ్యాలీకి కేసీఆర్ జవసత్వాలు
హైదరాబాద్ నగరానికి ఉత్తరాన షామీర్పేట పరిసరాల్లో ఏర్పాటైన జీనోమ్ వ్యాలీ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసినా.. 14-15 ఏండ్లపాటు విద్యుత్తు, నీటి సమస్యలు కొనసాగాయి. కంపెనీల స్థాపనకు అనుమతులు తీసుకోవాలన్నా అదో పెద్ద ప్రహసనంగా ఉండేది. దీంతో కంపెనీలు ముఖం చాటేశాయి. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కష్టాలన్నింటికీ చరమ గీతం పాడింది. నిరంతరాయ కరెంటు సరఫరా, నీటి సౌకర్యం, టీఎస్ఐపాస్తో అనుమతులన్నీ ఒకేచోట అది కూడా నిర్ణీత వ్యవధిలో జారీ చేయడంతో జీనోమ్ వ్యాలీకి కంపెనీలు క్యూకట్టాయి. అలా కేసీఆర్ పాలనలో అతి తక్కువ కాలంలోనే ఆసియాలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్ క్లస్టర్గా జీనోమ్ వ్యాలీ నిలిచింది. కేసీఆర్ ప్రభుత్వంలోనే 18 దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగించాయి. దేశంలోనే అతిపెద్ద మూడు వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ ఇక్కడ కొలువుదీరాయి. దాదాపు 200కు పైగా కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. జీనోమ్ వ్యాలీపై ఆధారపడి అక్కడ 25 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. జీనోమ్ వ్యాలీలో పరిశోధనలు ఊపందుకోవడంతో కేసీఆర్ పాలనలో 9 ఏండ్లలో లైఫ్ సైన్సెస్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి తరలివచ్చాయి. లైఫ్ సైన్సెస్, దాని అనుబంధ రంగాల్లో కొత్త కంపెనీల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తంగా 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
జీనోమ్ వ్యాలీ అభివృద్ధిలో ఏమైంది?
దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం వ్యాక్సిన్లలో రాష్ట్ర వాటా 33 శాతం
దేశంలో ఉత్పత్తయ్యే బల్క్ డ్రగ్స్లో తెలంగాణ వాటా 43 శాతం
9 ఏండ్లలో లైఫ్ సైన్సెస్లో రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడులు 4 లక్షల కోట్లు
కొత్త కంపెనీల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించిన ఉద్యోగాలు 25 లక్షలు
కేసీఆర్ దూరదృష్టితో జీసీసీలకు అడ్డాగా హైదరాబాద్
హైదరాబాద్లో ప్రస్తుతం మొత్తం జీసీసీలు-సుమారు 400
దేశంలో ప్రారంభమయ్యే ప్రతి 100 జీసీసీల్లో హైదరాబాద్లో ఏర్పాటయ్యేవి 20
ఐదేండ్లలో నగరంలో నమోదైన జీసీసీల్లో పెరుగుదల 35.7 శాతం
నగరంలోని జీసీసీల్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 3 లక్షల మంది
