Meenakshi Chaudhary | టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం, తిరుమల విశిష్టతపై ఆమె ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. తన వీడియోలో మీనాక్షి మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నా మనసుకు ఎంతో ప్రశాంతత, ఆనందం లభించింది. ఇక్కడ వీచే గాలిలో కూడా ‘గోవిందా’ నామస్మరణ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. భక్తులకు అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి” అని అన్నారు.
దర్శనం నుంచి అన్నప్రసాదాల వరకు అన్ని ఏర్పాట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మేనేజ్మెంట్ పనితీరును మెచ్చుకున్నారు. భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాదాల గురించి కూడా ఆమె మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహణ జరుగుతుండటాన్ని ఆమె అభినందించారు. “ఇక్కడి సేవా భావం నిజంగా అభినందనీయం” అని పేర్కొన్నారు.
మీనాక్షి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. చాలా మంది నెటిజన్లు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ, “తిరుమల సేవలు నిజంగానే అద్భుతం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమె భక్తి భావాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం ప్రస్తుతం తిరుమల అంశంపై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో, ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా చేయించారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమలపై జరుగుతున్న వివాదాల మధ్య మీనాక్షి ఈ వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయమా? లేక వేరే కోణాలున్నాయా? అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఏది ఏమైనా, తిరుమల దర్శనానంతరం తన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకున్న మీనాక్షి చౌదరి వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్గా మారింది.
