ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ (పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ సర్వీసెస్)కి నోటీసులు జారీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఏంఈ) డాక్టర్ రఘనందన్ను ఆదేశించారు. మరోమారు ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డీఏంఈకి మంత్రి సూచించారు. అలాగే ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ను వివరణ కోరుతూ మెమో జారీ చేయాలని కళాశాల ప్రిన్సిపల్ను మంత్రి ఆదేశించారు. ఇక హాస్టల్లోని పరిస్థితులను పరిశీలన చేయాలంటూ ఇప్పటికే అధికారులను డీఎంఈ రఘునందన్ ఆదేశించారు.
అసలు ఏం జరిగిందంటే ?
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచింది. ఈ ఘటనతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ ఘటన శనివారం జరిగింది. అయితే కళాశాలకు సంబంధించిన నూతన భవనాల నిర్మాణ పనులు జరగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడున్న పొదలు, చెట్లను తొలగించారు. వాటిలో నివసించే ఎలుకలు, ఇతర కీటకాలు సమీపంలోని ఆసుపత్రి భవానాల్లోకి వస్తున్నాయి. దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఎలుకలు.. తమను కరుస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. కొంత కాలం నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెబుతున్నారు.ఆ క్రమంలో తమకు రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులను ఎలుక కరిచిన విషయం మీడియాలో వైరల్ అయింది. దీనిపై మంత్రి సీరియస్ అయ్యారు.
The post Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
