తిరుపతి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసు కున్నారు. నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించిన అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నలుగురు కింగ్పిన్స్ను గుర్తించాం – డిప్యూటీ సీఎం పవన్
ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎర్రచందనం చెట్టు వెనుక ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించాం. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2లక్షల ఎర్రచందనం చెట్లు కొట్టేసి ఉంటారని అధికారుల అంచనా. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశాం. స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం చేసుకుందామని కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కోరాం. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్స్ చేస్తున్న నలుగురు కింగ్ పిన్స్ను గుర్తించాం. వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాం.
శేషాచలం అడవుల్లో మాత్రమే ఉండే ఎర్రచందనం చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయి. ఈ చెట్ల నరికివేతలో స్థానికులు పాల్గొనవద్దు. ఆపరేషన్ కగార్ను అమలు చేస్తున్న ఈ దేశంలో… ఎర్ర చందనం స్మగర్ల ఆట కట్టించడం పెద్ద లెక్క కాదు. స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే… ఎలాంటి చర్యలకైనా వెనుకాడం. అటవీ చట్టం ప్రకారం… ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఒక సారి ఆపరేషన్ మొదలు పెడితే … వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎర్రచందనం నరికివేతలో పాల్గొనే తమిళనాడు కూలీలకు కూడా అవగాహన కల్పిస్తాం. వేంకటేశ్వరస్వామి భక్తులు కూడా ఎర్రచందనాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి’’ అని పవన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఏపీదే
దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. పొరుగనున్న నేపాల్లో సైతం శేషాచల అడువుల్లో పెరిగిన ఎర్రచందనం పట్టుబడిందని తెలిపారు. గత ఐదేళ్లలో విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. దీని విలువ రూ. 5 వేల కోట్ల ఉంటుందన్నారు. దాదాపు లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లు నరికేశారని వివరించారు. స్మగ్లింగ్ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ఎర్రచందనం చెట్లను మనమే కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సూచించారు. అందుకోసం అధికారంలోకి రాగానే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా.. దానిని మనకే అప్పగించేలా ఒప్పందం ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
The post Pawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్ తనిఖీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
