రాజస్థాన్ లోని జైసల్మేర్ లో మంగళవారంనాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15 మంది సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బస్సు ప్రమాద సమయంలో మొత్తం 57మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు వెంటనే బస్సులు నిలిపివేశారు. నేషనల్ హైవేపై బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో కిలోమీటర్ల వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోనికి తెచ్చాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిప్రమాదానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ఈ ఘటనలో భయాందోళనకు గురైన ప్రయాణికులు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు హాహాకారాలు చేస్తూ బస్సు నుంచి బయటకు దూకారు. ఆ సమయంలో బస్సులో ఉన్న పలురువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బస్సు నిర్వహణలో లోపం ఉందా? మంటలు ఎలా చెలరేగాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. బస్సు ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ పెను ప్రమాదం ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు నిరంతర తనిఖీలు, తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
The post Rajasthan: రాజస్థాన్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ! 15 మంది సజీవదహనం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
