Supritha | టాలీవుడ్ నటి సురేఖా వాణి ఆమె కూతురు సుప్రిత నాయుడు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తల్లీకూతుళ్లు స్నేహితుల్లా కలిసి ఉండటం, సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేయడం తెలిసిందే. వారి ఆప్యాయత, ఓపెన్ బాండింగ్ ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల సుప్రీత తన తల్లి భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. భర్త మరణం తర్వాత సురేఖ వాణి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమెకు కూతురు సుప్రీత ప్రధాన ఆధారం అయింది. ఇప్పుడు అదే కూతురు తన తల్లి జీవితంపై తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది.
నేను పెళ్లి చేసుకునే ముందు, నా అమ్మకు జీవితంలో ఒక మంచి తోడు ఉండాలి. ఆమెను ప్రేమగా చూసుకునే, గౌరవించే వ్యక్తి రావాలి అని సుప్రీత వెల్లడించింది. ఈ విషయాన్ని తాను కుటుంబ సభ్యులతో కూడా చర్చించానని, వారు కూడా తన అభిప్రాయానికి మద్దతు తెలిపారని చెప్పింది. అయితే ఇది కేవలం తన కోరిక మాత్రమే కాదని ఆమె స్పష్టం చేసింది. “అమ్మ సంతోషమే నాకు ముఖ్యం. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. నాన్న స్థానాన్ని మరెవరికి ఇవ్వాలని ఆమెకు ఇష్టం లేదు. ఆమెను బలవంతం చేయను. కానీ అమ్మ ఒంటరిగా ఉండకూడదని మాత్రమే నేను కోరుకుంటున్నాను” అంటూ ప్రేమతో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హృదయాలను తాకుతున్నాయి.
ఇప్పటికీ వితంతువుల రెండో పెళ్లిపై సమాజంలో మిశ్రమ అభిప్రాయాలు ఉన్నప్పటికీ, తల్లి భవిష్యత్తు కోసం ముందుగా ఆలోచిస్తున్న సుప్రీత నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. తల్లికి మంచి జీవితం కావాలని కోరుకునే కూతురి మనసు నిజంగా ప్రశంసనీయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తల్లీకూతుళ్ల మధ్య ఉన్న ఈ ఆప్యాయ బంధం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, సుప్రీత ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్గా సత్తా చాటుతుంది.
