అమరావతి : రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్లకు రూ.1 కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. బోర్లు కూడా మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేలా వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తించేందుకు సీఎం ఆమోదాన్ని తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం అందించే పౌరసేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత పెంచేందుకు, సమర్ధంగా వినియోగించేందుకు వీలుగా నిపుణులతో కూడిన సలహా మండలి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచేలా ఓ వర్క్షాప్ నిర్వహించాలని సీఎం సూచనలు చేశారు. మైనింగ్ కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్న తీరును అధ్యయనం చేసి ఏపీలోనూ అమలు చేసేలా చూడాలన్నారు. అవేర్ సాంకేతికతను వినియోగించుకుని వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ప్రాంతాల్లో వడదెబ్బకు గురి కాకుండా ప్రజలకు ఉపశమనం కలిగేలా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వచ్చంధ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు.
The post అదనపు వాహన రిజిస్ట్రేషన్ అథారిటీగా వాహన డీలర్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
