తిరుమల : తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. మ్యూజియం ఆధునీకరణ పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అడిషనల్ ఈవో చౌదరి మాట్లాడారు. ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులు నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.
సుమారు 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియంలో దాదాపు లక్ష చదరపు అడుగుల మేర పనులు పూర్తయ్యాయని అన్నారు. మొత్తం 14 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. తిరుమల క్షేత్ర వైభవం, ఆలయ చారిత్రక నేపథ్యం, శాసనాలు, అన్నమాచార్య గ్యాలరీ, పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి వివిధ రాజ వంశీయులకు శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని గ్యాలరీలలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.
మ్యూజియాన్ని దీర్ఘకాలిక సుస్థిరతతో ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడంపై కూడా చర్చించామని అన్నారు ఏఈవో. భక్తులకు మెరుగైన అనుభవం కల్పించేలా ప్రవేశ, నిష్క్రమణ సదుపాయాలు, క్యాఫెటీరియా, సావనీర్ షాప్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. భక్తుల తిరుమల యాత్రకు ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక అనుభూతి కలిగించేలా ఈ మ్యూజియాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మ్యూజియం ఆఫీసర్ (ఎఫ్ఏసీ) శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు, టీసీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
The post శరవేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
