అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా తన వంతుగా రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి సభ్యత్వాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా గుర్తిస్తామని అన్నారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా సత్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం. జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
150 మందితో పార్టీని ప్రారంభించామని తెలిపారు. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేలు నమోదు చేశామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరిందన్నారు. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని చెప్పారు డిప్యూటీ సీఎం. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారు మనకు ముఖ్యం అన్నారు. అలాంటి వారే పార్టీకి అత్యంత అవసరమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ , పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
The post జనసేన పార్టీ సభ్యత్వానికి పవన్ రూ. 2 కోట్లు విరాళం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
