హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ పిండి చేస్తోందని ఆరోపించారు. మంగళవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టడంపై తీవ్రంగా మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు.. మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూకబ్జాలు ఎందుకు కనిపించడం లేదంటూ నిలదీశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిద్ర పోతున్నారా అంటూ ప్రశ్నించారు.
వెంటనే అక్రమ మైనింగ్ నిలిపివేసి, దోచుకున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయడంతో పాటు అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యు, మైనింగ్, పీసీబీ, HMDA అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం? మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా అంటూ భగ్గుమన్నారు హరీశ్ రావు.
ముఖ్యమంత్రి అల్లుడు అనుయాయులు, మంత్రి పొంగులేటి గారి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీకి సంబంధించిన ఫోటోలు, పూర్తి వివరాలను మీడియా సాక్షిగా విడుదల చేస్తున్నానని ప్రకటించారు.
The post అల్లుడు అక్రమ మైనింగ్ మంత్రి రియల్ ఎస్టేట్ దందా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
